Harish Rana : కారుణ్య మరణం పొందిన హరీష్ రాణా ఇక లేరు..ఎయిమ్స్‌లో తుదిశ్వాస!

దేశంలోనే మొదటిసారిగా కోర్టు అనుమతితో కారుణ్య మరణం పొందిన హరీష్ రాణా (31) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. దాదాపు 13 ఏళ్లుగా అపస్మారక స్థితిలో  కొట్టుమిట్టాడుతున్న ఆయన సుదీర్ఘ పోరాటం ఈ మరణంతో ముగిసింది.

New Update
harish rana

దేశంలోనే మొదటిసారిగా కోర్టు అనుమతితో కారుణ్య మరణం పొందిన హరీష్ రాణా (31) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. దాదాపు 13 ఏళ్లుగా అపస్మారక స్థితిలో  కొట్టుమిట్టాడుతున్న ఆయన సుదీర్ఘ పోరాటం ఈ మరణంతో ముగిసింది.

హరీష్ రాణా కథ ఎంతో విషాదకరమైనది. 2013లో పంజాబ్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న సమయంలో, నాలుగో అంతస్తు బాల్కనీ నుండి ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుండి ఆయన స్పృహ లేకుండా కేవలం యంత్రాల సాయంతోనే ప్రాణాలతో ఉన్నారు. పదేళ్లకు పైగా కృత్రిమ ఆహారం, ఆక్సిజన్ సాయంతోనే ఆయన జీవనం సాగింది. ఆయన పరిస్థితిని చూసి చలించిపోయిన కుటుంబ సభ్యులు, ఆయనకు గౌరవప్రదమైన మరణాన్ని ప్రసాదించాలని కోర్టును ఆశ్రయించారు.

మార్చి 11న చారిత్రాత్మక తీర్పు

ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు, మార్చి 11న చారిత్రాత్మక తీర్పునిచ్చింది. హరీష్‌కు కారుణ్య మరణం ఇచ్చేందుకు అనుమతిస్తూ, వైద్యుల పర్యవేక్షణలో గౌరవప్రదంగా లైఫ్ సపోర్ట్ తొలగించాలని ఆదేశించింది. దీనికోసం ఘజియాబాద్‌లోని తన నివాసం నుండి మార్చి 14న ఢిల్లీ ఎయిమ్స్‌కు ఆయన్ని తరలించారు. అక్కడ డాక్టర్ సీమా మిశ్రా నేతృత్వంలోని నిపుణుల బృందం హరీష్‌కు చికిత్స అందించింది.

కోర్టు ఆదేశాల మేరకు, వైద్య ప్రోటోకాల్‌ను అనుసరిస్తూ హరీష్‌కు అందిస్తున్న కృత్రిమ ఆహారాన్ని, ఇతర వైద్య సాయాన్ని వైద్యులు దశలవారీగా నిలిపివేశారు. చివరకు ఆయన ప్రశాంతంగా ప్రాణాలు విడిచారు. ఇండియాలో ఇలాంటి ఒక ప్రక్రియ జరగడం ఇదే మొదటిసారి. మనిషి బ్రతికే హక్కుతో పాటు, గౌరవంగా మరణించే హక్కు కూడా ఉంటుందని ఈ కేసు మరోసారి నిరూపించింది.

Advertisment
తాజా కథనాలు