/rtv/media/media_files/2026/05/15/petrol-and-diesel-prices-hiked-2026-05-15-11-11-23.jpg)
Petrol, Diesel prices hiked
ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సగటు వినియోగదారుడు సతమతమవుతుంటే.. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా రూ. 10 వరకు పెరగొచ్చని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఎమ్కే గ్లోబల్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, పశ్చిమ ఆసియా యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
పెట్రోల్, డీజిల్పై రూ. 3 చొప్పున
దీని ప్రభావంతో దేశీయ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు శుక్రవారమే లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ. 3 చొప్పున పెంచాయి.కేంద్ర ప్రభుత్వం మార్చి 27న ఇంధన దిగుమతులపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 తగ్గించినప్పటికీ, అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల చమురు సంస్థలకు నష్టాలు తప్పడం లేదు.ప్రస్తుతం చమురు సంస్థలు లీటర్ పెట్రోల్, డీజిల్ అమ్మకంపై రూ. 17 నుండి రూ. 18 వరకు నష్టపోతున్నాయి. ఈ త్రైమాసికంలో ఇవి ఏకంగా రూ. 57,000 కోట్ల నుండి రూ. 58,000 కోట్ల వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నష్టాల నుంచి గట్టెక్కడానికి రాబోయే 2-3 వారాల్లో ఒకేసారి లేదా విడతల వారీగా లీటరుకు రూ. 10 వరకు ధరలు పెంచక తప్పదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇంధన ధరల భారం ఒకవైపు ఉంటే.. దేశంలోనే అతిపెద్ద డెయిరీ బ్రాండ్లు అయిన అముల్ , మదర్ డెయిరీ లు లీటర్ పాలుపై రూ. 2 చొప్పున ధరలు పెంచాయి. గత 13 నెలల్లో ఈ సంస్థలు ధరలు పెంచడం ఇది రెండోసారి. వీటిని చూసి త్వరలోనే ప్రాంతీయ డెయిరీ కంపెనీలు కూడా పాల ధరలను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
పెట్రోల్, డీజిల్, పాలు, వంటగ్యాస్ ధరల పెరుగుదల వల్ల రాబోయే రోజుల్లో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 0.42% వరకు పెరిగే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ మేఘా అరోరా తెలిపారు.
డీజిల్ ధరలు పెరిగితే లారీల ఫ్రైట్ ఛార్జీలు పెరుగుతాయి. దీనివల్ల కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆటోమేటిక్గా పైకి లేస్తాయి.పెట్రోల్ సెగతో నగరాల్లో ఆటోలు, ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ల ఛార్జీలు, లాజిస్టిక్స్ ఖర్చులు మరింత ప్రియం కానున్నాయి. ట్రాక్టర్లు, పంపుసెట్లకు డీజిల్ వాడకం తప్పనిసరి కాబట్టి రైతులకు పెట్టుబడి వ్యయం పెరుగుతుంది.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర ప్రతి 10 డాలర్లు పెరిగినప్పుడల్లా దేశ జిడిపి అంచనాలు పడిపోతాయని, ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్థికవేత్త సంతోష్ మెహ్రోత్రా ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం రేటు 4.6% నుండి 5.0% కి చేరవచ్చని రేటింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
Follow Us