/rtv/media/media_files/2026/05/17/cng-2026-05-17-09-30-54.jpg)
ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. ప్రముఖ గ్యాస్ పంపిణీ సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఆదివారం కిలో సీఎన్జీ ధరపై మరో రూపాయి పెంచింది. కేవలం 48 గంటల వ్యవధిలోనే ధరలు పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. తాజాగా పెరిగిన రూపాయితో కలిపి ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర మొదటిసారి రూ. 80 మార్కును దాటి రూ. 80.09కి చేరింది.
నోయిడా, ఘజియాబాద్ ఈ ప్రాంతాల్లో కిలో సీఎన్జీ ధర రూ.88.70కి చేరుకుంది. అంతకుముందు, మే 15న కూడా ఐజీఎల్ కిలో సీఎన్జీపై రూ.2 పెంచిన సంగతి తెలిసిందే. అప్పుడు ఢిల్లీలో ధర రూ.79.09గా ఉండగా.. ఈరోజు పెరిగిన రూపాయితో అది రూ.80 దాటేసింది. మే 15నే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను కూడా లీటరుకు సుమారు రూ. 3 చొప్పున పెంచింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.77గా, డీజిల్ ధర రూ.90.67గా ఉంది.
ముడిచమురు ధరలు భారీగా
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ లో దిగ్బంధనం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే చమురు, గ్యాస్ వ్యాపారంలో ఐదో వంతు ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఇక్కడ సరఫరాకు అంతరాయం కలగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ ఇంధన ధరల పెంపుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 100 డాలర్లు దాటినప్పటికీ, భారత్లో ధరల నియంత్రణకు ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పారు.
Follow Us