/rtv/media/media_files/2026/03/24/delimitation-2026-03-24-09-55-06.jpg)
Delimitation
Delimitation : దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకూ ఒక స్పష్టతనిచ్చింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తారని సాగుతున్న ప్రచారానికి తెరదింపుతూ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం లోక్సభ, అసెంబ్లీలలో ఉన్న సీట్ల సంఖ్యను 50 శాతం పెంపుదల చేయనున్నట్లు కేంద్రం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు బిల్లులో నిబంధనలను పొందుపరిచినట్లు సమాచార శాఖ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. డీలిమిటేషన్ ప్రక్రియ కేవలం 2011 జనాభా లెక్కల ఆధారంగానే జరుగుతుందని గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం కొట్టిపారేసింది. అలాంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అపోహలను నమ్మవద్దని సూచించింది. జనాభా ప్రాతిపదికన మాత్రమే కాకుండా, భౌగోళిక విస్తీర్ణం, ఇతర శాస్త్రీయ అంశాలను పరిగణనలోకి తీసుకుని సీట్ల పెంపు ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
అలాగే ప్రస్తుతమున్న అసెంబ్లీ, లోక్సభ సీట్ల సంఖ్యను అధనంగా పెంచుతామని తెలిపింది. తద్వారా పెద్ద రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం పెరుగుతుందని తెలిపింది. పునర్విభజన విధివిధానాలు బిల్లులో స్పష్టంగా ఉన్నాయని, చట్టపరమైన ప్రక్రియ ప్రకారమే ఇది జరుగుతుందని సమాచార శాఖ స్పష్టత నిచ్చింది. ఈ అంశంపై పార్లమెంటులో జరిగే చర్చ సందర్భంగా పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తామని, విపక్షాల సందేహాలను నివృత్తి చేస్తామని కేంద్రం వివరించింది. నియోజకవర్గాల సంఖ్య 50 శాతం పెరగడం వల్ల దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల అటు లోక్సభలో, ఇటు అసెంబ్లీలలో నూతన నాయకత్వానికి అవకాశం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Follow Us