/rtv/media/media_files/2026/06/02/cbse-2026-06-02-20-39-11.jpg)
దేశవ్యాప్తంగా CBSE బోర్డు పరీక్షల మూల్యాంకనంలో జరిగిన పెద్ద గందరగోళంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి వ్యతిరేకత రావడంతో.. సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్, సెక్రటరీ హిమాన్షు గుప్తాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పదవుల నుంచి బదిలీ చేసింది. అంతేకాకుండా, ఆన్-స్క్రీన్ మార్కింగ్ సేవల కాంట్రాక్ట్ కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.
సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత, విద్యార్థులు తమ సమాధాన పత్రాల స్కాన్ చేసిన కాపీలను ఆన్లైన్లో చూసుకునే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మంది విద్యార్థుల పేజీలు సరిగ్గా కనిపించకపోవడం, కొన్ని సెక్షన్లు మిస్ అవ్వడం వంటి సమస్యలు వచ్చాయి. దీనిపై విచారించగా.. డిజిటల్ మూల్యాంకనం కోసం వాడిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ ప్లాట్ఫారమ్ టెండర్ల ప్రక్రియలో, వెండర్ ఎంపికలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు సైబర్ భద్రత లోపాలు, రీ-వాల్యుయేషన్ ఆలస్యం అవ్వడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. పరిస్థితి చేయి దాటడంతో సీబీఎస్ఈ గడువును పొడిగించినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఈ వివాదం కారణంగా పదవులు కోల్పోయిన ఇద్దరు అధికారులు ఐఏఎస్ కేడర్కు చెందినవారే కావడం గమనార్హం.
రాహుల్ సింగ్ (CBSE చైర్మన్): బోర్డుకు సంబంధించిన పరీక్షలు, అకడమిక్స్, కొత్త విద్యా విధానాల అమలు విద్యా మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకునే మొత్తం బాధ్యత ఈయనే చూసేవారు.
హిమాన్షు గుప్తా (CBSE సెక్రటరీ): బోర్డు పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, పాఠశాలల గుర్తింపు (అఫిలియేషన్) రోజువారీ కార్యకలాపాలను ఈయన పర్యవేక్షించేవారు.
ఒకే ఒక్క సభ్యురాలితో
ఈ అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్. రాధా చౌహాన్ నేతృత్వంలో ఒకే ఒక్క సభ్యురాలితో కూడిన వన్-మ్యాన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఇతర శాఖల అధికారుల సహాయం తీసుకునే హక్కు కూడా కల్పించారు. ఒక నెల రోజుల్లోగా పూర్తి నివేదికను పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి సమర్పించాలని కేంద్రం ఆదేశించింది.
Follow Us