/rtv/media/media_files/2026/03/09/cbi-summons-vijay-again-for-questioning-in-karur-stampede-probe-on-tuesday-2026-03-09-15-08-50.jpg)
CBI summons Vijay again for questioning in Karur stampede probe on Tuesday
కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి TVK అధినేత విజయ్కు CBI మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణ నిమిత్తం మార్చి 15న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. విజయ్ను ఇప్పటికే జనవరి నెలలో సీబీఐ అధికారులు రెండుసార్లు విచారించారు. తాజాగా మార్చి 9న హాజరుకావాలని గతంలోనే సూచించినప్పటికీ, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన రాజకీయ కార్యక్రమాల దృష్ట్యా విచారణను 15 రోజుల పాటు వాయిదా వేయాలని విజయ్ కోరారు. విచారణను ఢిల్లీలో కాకుండా చెన్నై లేదా తమిళనాడులోని ఏదైనా కార్యాలయంలో నిర్వహించాలని ఆయన అభ్యర్థించారు. అయితే, సీబీఐ ఈ అభ్యర్థనను తోసిపుచ్చుతూ, మార్చి 15న ఢిల్లీలోనే విచారణకు రావాలని స్పష్టం చేసింది.
సెంథిల్ బాలాజీకి సమన్లు
అదేవిధంగా, కరూర్ డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీకి కూడా సీబీఐ నోటీసులు పంపింది. మార్చి 17న విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. దీనిపై బాలాజీ స్పందిస్తూ.. తాను విచారణకు సహకరిస్తానని, మార్చి 17న అధికారుల ముందుకు వచ్చి కరూర్ ఘటనపై వివరణ ఇస్తానని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణ
ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో, సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ ఘటన ప్రజలను తీవ్రంగా కలిచివేసిందని వ్యాఖ్యానించింది. గత అక్టోబరులో జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ఒక పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలగాలంటే ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగాలని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం సీబీఐ ఈ ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించే పనిలో ఉంది.
Follow Us