Bihar : పోలీస్ బాస్ 80 కోట్ల అవినీతి.. పనిమనిషికే బంగ్లా, థార్ కారు!

బీహార్‌లోని కిషన్‌గంజ్ ఎస్డీపీఓ గౌతమ్ కుమార్ నివాసాలపై ఇటీవల జరిగిన ఈఓయూ దాడులు పెను దుమారాన్ని రేపుతున్నాయి. 32 ఏళ్ల సర్వీసులో ఆయన తన ఆదాయానికి మించి

New Update
car

బీహార్‌లోని కిషన్‌గంజ్ ఎస్డీపీఓ గౌతమ్ కుమార్ నివాసాలపై ఇటీవల జరిగిన ఈఓయూ దాడులు పెను దుమారాన్ని రేపుతున్నాయి. 32 ఏళ్ల సర్వీసులో ఆయన తన ఆదాయానికి మించి దాదాపు 60 శాతం అంటే సుమారు 80 కోట్ల రూపాయల బినామీ ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ దాడుల్లో ఎస్డీపీఓ ఇంట్లో పనిచేసే పనిమనిషి పారో గురించి తెలిసిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

కోటి రూపాయల విలువైన బంగళా

ఎస్డీపీఓ గౌతమ్ కుమార్ ఇంట్లో పనిచేసే పారో అనే మహిళకు పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో సుమారు ఒక కోటి రూపాయల విలువైన బంగళా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేవలం ఇల్లు మాత్రమే కాదు, ఆమె రోజువారీ జీవనశైలి కూడా చాలా విలాసవంతంగా ఉండేది. ఆమె రోజుకు 35 లక్షల రూపాయల విలువైన 'థార్' కారులో పనికి వచ్చేదని, కొన్నిసార్లు ఎస్డీపీఓ ప్రభుత్వ వాహనంలోనే ఆమెను తీసుకువచ్చేవారని సమాచారం. గౌతమ్ కుమార్ ఆమెకు ఒక 'బుల్లెట్' బైక్‌ను కూడా గిఫ్ట్‌గా ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు.

పారో సామాన్యమైన పనిమనిషిలా కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె బుల్లెట్ బైక్‌పై రీల్స్ చేయడం, లక్షన్నర రూపాయల నగదును చేతిలో పట్టుకుని వీడియోలు తీయడం వంటివి చేసేది. ఎస్డీపీఓ, ఆయన స్నేహితులతో కలిసి ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే సోదాల వార్త తెలియగానే ఆమె తన అకౌంట్‌ను లాక్ చేసి, కుటుంబంతో సహా పరారైనట్లు తెలుస్తోంది.

మార్చి 31న గౌతమ్ కుమార్ నివాసాల్లో జరిగిన సోదాల్లో 36 భూములకు సంబంధించిన పత్రాలు, బంగారు, వెండి ఆభరణాలు, ఖరీదైన వాచీలు మరియు విలాసవంతమైన కార్ల కాగితాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్ణియాలో నాలుగు అంతస్తుల మేడ, సిలిగురిలో తేయాకు తోటలు, నోయిడా మరియు గుర్గావ్‌లో ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి గౌతమ్ కుమార్‌ను పదవి నుండి తొలగించి, హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్ట్ చేయమని ఆదేశించారు.

Advertisment
తాజా కథనాలు