/rtv/media/media_files/2026/03/18/air-travellers-2026-03-18-14-51-15.jpg)
విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విమానాల్లో సీట్ల ఎంపిక పేరుతో విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రయాణికుల హక్కులను కాపాడుతూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
60% సీట్లు ఉచితం.. సీటు ఎంపికలో వెసులుబాటు!
ఇప్పటివరకు విమానాల్లో విండో సీట్ లేదా నచ్చిన సీటు కావాలంటే ప్రయాణికులు ఎక్ట్రా ఛార్జస్ చెల్లించాల్సి వచ్చేది. అయితే, తాజా ఉత్తర్వుల ప్రకారం.. విమానంలోని మొత్తం సీట్లలో కనీసం 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం విమానయాన సంస్థలను ఆదేశించింది. ఈ సీట్లను ప్రయాణికులు తమకు నచ్చిన విధంగా ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలి.
కుటుంబ సభ్యులకు పక్కపక్కనే సీట్లు
ఒకే టికెట్పై ప్రయాణించే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు వేర్వేరు సీట్లలో కూర్చోవాల్సి రావడం పెద్ద సమస్యగా మారింది. పక్కపక్కనే కూర్చోవాలంటే అదనపు బాదుడు తప్పడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా, ఒకే బుకింగ్తో ప్రయాణించే వారిని వీలైనంత వరకు సమీప సీట్లలోనే కూర్చోబెట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. దీనివల్ల గ్రూపుగా ప్రయాణించే వారికి అదనపు ఖర్చు తగ్గుతుంది.
క్రీడాకారులు, కళాకారులకు ఊరట
గతంలో క్రీడా సామగ్రి లేదా సంగీత వాయిద్యాలను విమానాల్లో తీసుకెళ్లడం ప్రయాణికులకు ఇబ్బందిగా ఉండేది. ఈ విషయంలో విమానయాన సంస్థలు స్పష్టమైన మరియు సరళమైన విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం సూచించింది. భద్రతా నిబంధనలు పాటిస్తూనే, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించింది.
పెంపుడు జంతువులు & ప్రయాణికుల హక్కులు
పెంపుడు జంతువులు: పెంపుడు జంతువులను విమానాల్లో తీసుకెళ్లే విషయంలో నెలకొన్న గందరగోళాన్ని తొలగిస్తూ స్పష్టమైన నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం పేర్కొంది. విమానాల ఆలస్యం, రద్దు లేదా బోర్డింగ్ నిరాకరణ వంటి సందర్భాల్లో ప్రయాణికులకు ఉండే హక్కులను విమానయాన సంస్థలు తమ వెబ్సైట్లు, యాప్లు, ఎయిర్పోర్ట్ కౌంటర్లలో ప్రాంతీయ భాషల్లో స్పష్టంగా ప్రదర్శించాలి.
కేంద్ర ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, సామాన్య ప్రయాణికుడిపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించనుంది.
Follow Us