/rtv/media/media_files/2026/05/08/palaniswamy-new-2026-05-08-11-14-54.jpg)
తమిళనాడు ఎన్నికల అనంతరం ఊహించని రాజకీయ మలుపులు చోటుచేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే తీసుకోబోయే నిర్ణయాలు ఇప్పుడు ఢిల్లీ స్థాయికి చేరాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమిని వీడి, డీఎంకేతో కలిసి వెళ్లేందుకు ఎడప్పాడి పళనిస్వామి (EPS) సిద్ధమవుతున్నారనే వార్తలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విజయ్కు చెందిన టీవీకే పార్టీని అడ్డుకోవడానికి, దశాబ్దాల శత్రువైన డీఎంకేతో కలిసి వెళ్లడానికి పళనిస్వామి మొగ్గు చూపుతుండటంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం.
డీఎంకేతో బీజేపీ పొత్తు
ఎన్నికల ముందు ఎంతో నమ్మకంతో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. రాష్ట్రంలో పార్టీని సొంతంగా బలోపేతం చేయాలన్న అన్నామలై వ్యూహాన్ని కాదని, కేవలం అన్నాడీఎంకే కోసమే బీజేపీ అధిష్టానం కూటమి కట్టింది. తీరా ఎన్నికల ఫలితాలు రాగానే.. బీజేపీని సంప్రదించకుండానే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పళనిస్వామి ప్రయత్నించడం తీవ్ర విశ్వాసఘాతుకమని అమిత్ షా భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి.
"అన్నాడీఎంకేతో అసలు పొత్తు పెట్టుకోవడమే పెద్ద తప్పు" అనే అభిప్రాయానికి బీజేపీ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఒంటరిగా పోటీ చేసి ఉంటే, సీట్లు రాకపోయినా పార్టీకి భారీగా ఓట్ల శాతం పెరిగి ఉండేదని, అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వడం వల్ల బీజేపీ నష్టపోయిందని పార్టీ అంతర్గత విశ్లేషణల్లో నేతలు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, ఢిల్లీ ఎంత సీరియస్ అయినా సరే పళనిస్వామి మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన బలం తనకు ఉందని ఆయన బలంగా నమ్ముతున్నారు. పుదుచ్చేరి రిసార్ట్లో ఉన్న తన ఎమ్మెల్యేలతో పళనిస్వామి మాట్లాడుతూ.. కంగారు పడకండి.. డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు కూడా మనకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన ప్రభుత్వమే రాబోతోందని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ రాజకీయ చదరంగంలో అమిత్ షా ఆగ్రహం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో.. పళనిస్వామి అనుకున్నట్లుగా డీఎంకే సపోర్ట్తో పీఠం దక్కుతుందో లేదో చూడాలి!
Follow Us