చైనాకు బిగ్ షాక్.. అమెరికా గ్రీన్ సిగ్నల్‌తో భారత్‌ వైపుకు 7 రష్యా చమురు నౌకలు

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను భారత్ వేగంగా పెంచుతోంది. ఎంతలా అంటే, వాస్తవానికి చైనాకు వెళ్లాల్సిన చమురు నౌకలు ఇప్పుడు తమ మార్గాన్ని మార్చుకుని భారత తీరాలకు చేరుకుంటున్నాయి.

New Update
_Russian oil ships

భారతదేశ ఇంధన రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను భారత్ వేగంగా పెంచుతోంది. ఎంతలా అంటే, వాస్తవానికి చైనాకు వెళ్లాల్సిన చమురు నౌకలు ఇప్పుడు తమ మార్గాన్ని మార్చుకుని భారత తీరాలకు చేరుకుంటున్నాయి. షిప్-ట్రాకింగ్ డేటా, 'వోర్టెక్సా లిమిటెడ్' గణాంకాల ప్రకారం, రష్యా చమురుతో ఉన్న కనీసం ఏడు భారీ ట్యాంకర్లు చైనాకు వెళ్లాల్సి ఉండగా, తమ దిశను మార్చుకుని భారత్ వైపు వస్తున్నాయి. ఇందులో జనవరి చివరిలో బాల్టిక్ సముద్రంలో లోడ్ అయిన ఒక నౌక, తొలుత చైనాలోని 'రిజావో' ఓడరేవుకు వెళ్లాల్సి ఉంది. కానీ, ఆగ్నేయాసియా జలాల్లోకి రాగానే అది తన మార్గాన్ని మార్చుకుని, మార్చి 21న మన న్యూ మంగళూరు పోర్టుకు చేరుకోనుంది. అలాగే 'జుజౌ ఎన్' అనే మరో ట్యాంకర్ మార్చి 25న గుజరాత్‌లోని సిక్కా రేవుకు చేరుకోనుందని సమాచారం.

భారత రిఫైనరీల జోరు

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొనగా రష్యా నుండి కొనుగోలు చేయడానికి అమెరికా మన దేశానికి తాత్కాలికంగా అనుమతినిచ్చింది. వారానికి 3 కోట్ల బ్యారెళ్ల మేర మినహాయింపు లభించడంతో, భారతీయ రిఫైనరీలు కేవలం వారం రోజుల్లోనే రష్యా నుంచి రికార్డు స్థాయిలో చమురును ఆర్డర్ చేశాయి. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన రిఫైనరీలు రష్యా ముడి చమురు మార్కెట్‌లో యాక్టివ్‌గా ఉన్నాయి.

గ్యాస్ సంక్షోభానికి చెక్

దేశం ఎదుర్కొంటున్న ఇంధన, గ్యాస్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో రష్యా చమురు కీలక పాత్ర పోషిస్తోంది. ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడిన సరఫరా అంతరాయాలను ఈ రష్యా దిగుమతులు భర్తీ చేస్తున్నాయి. దీనివల్ల దేశీయంగా ఇంధన ధరలు నియంత్రణలో ఉండే అవకాశం ఉంది. గతంలో రష్యా నుండి ప్రధానంగా చైనా మాత్రమే చమురు కొనుగోలు చేసేది. కానీ ఇప్పుడు భారత్‌తో పాటు జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు కూడా అనుమతులు లభించాయి.

చైనాకు షాక్: ఇతర దేశాలు పోటీ పడుతుండటంతో, చైనాకు అందే రష్యా చమురు వాటా తగ్గుతోంది. కొనుగోలుదారులు పెరగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో రష్యా చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న ఈ దౌత్య, వాణిజ్య వ్యూహం వల్ల దేశ ఇంధన భద్రతకు గట్టి భరోసా లభిస్తోంది.

Advertisment
తాజా కథనాలు