Kavitha: మోదీ నోటీసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తనకు మోదీ నోటీసులు అందాయంటూ సెటైర్లు వేశారు. ఈ నోటీసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఎన్నికల సమయంలో ఇలాంటి ఎపిసోడ్ మామూలే అని తెలిపారు. రాజకీయ కక్షతోనే నోటీసులు పంపారని ఆమె ఆరోపించారు.

New Update
Kavitha: మోదీ నోటీసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు

MLC Kavitha on ED Notice: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తనకు మోదీ (Modi) నోటీసులు అందాయంటూ సెటైర్లు వేశారు. ఈ నోటీసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఎన్నికల సమయంలో ఇలాంటి ఎపిసోడ్ మామూలే అని తెలిపారు. రాజకీయ కక్షతోనే నోటీసులు పంపారని ఆమె ఆరోపించారు. తన లీగల్ టీమ్ ఇచ్చే సలహా మేరకు ముందుకు సాగుతామన్నారు. లిక్కర్ కేసు (Delhi Liquor Scam) వ్యవహారం ఏడాది నుంచి టీవీ సీరియల్‌లా సాగుతోందని విమర్శించారు. బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తొలి నుంచి చెబుతున్నామని కవిత గుర్తు చేశారు.

అంతకుముందు కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రేపు(శుక్రవారం) విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఆమె బినామిగా పేర్కొంటున్న రామచంద్రన్ పిళ్లై అప్రూవర్‌గా మారిన వెంటనే నోటీసులు రావడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కవిత నిజామాబాద్ పర్యటనలో ఉన్నారు. హైదరాబాద్ వచ్చాక రేపు విచారణకు హాజరు కానున్నారో లేదోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కవిత మార్చి 16, 20, 21వ తేదీల్లో మూడు సార్లు ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అప్పుడు ఆమెను దాదాపు అరెస్ట్ చేస్తారనే వార్తలు జోరందుకున్నాయి. కానీ అలా జరగలేదు.

అంతేకాకుండా అప్పటి నుంచి కవిత విచారణ కూడా ఆగిపోయింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో ఆమె బినామి పిళ్లై అప్రూవర్‌గా మారడం ఆ వెంటనే కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సారి విచారణ సందర్భంగా ఆమెను అరెస్ట్ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి కవిత ఈడీ విచారణకు హాజరవుతుందా? ఏదైనా కారణాలతో వాయిదా కోరుతుందా? అని సందేహాలు వెలువడుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వచ్చిన తరువాత తెలంగాణలో కమలం పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ప్రజల్లో రెండు పార్టీలు ఒక్కటేనని బలంగా వెళ్లినట్లు బీజేపీ పెద్దలకు సీక్రెట్ రిపోర్టు అందినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మళ్లీ బీజేపీ బలం పెంచుకునేలా నోటీసులు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు