US-Iran Peace Talks : ఇస్లామాబాద్ చర్చలు ఎందుకు విఫలమయ్యాయి? అసలు కారణాలు ఇవే!

మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముగింపు పలకాలని పాకిస్థాన్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన 21 గంటల సుదీర్ఘ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి.

New Update
taks

మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముగింపు పలకాలని పాకిస్థాన్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన 21 గంటల సుదీర్ఘ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. శనివారం జరిగిన ఈ చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తాము ఒక అత్యుత్తమ ఆఫర్‌ను ఇచ్చామని, దానిని అంగీకరించకపోవడం ఇరాన్‌కే పెద్ద నష్టమని పేర్కొన్నారు. అయితే ఈ చర్చలు విఫలం కావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  

అమెరికా పెట్టిన ప్రధాన నిబంధన ఇరాన్ అణు ఆయుధాల తయారీని పూర్తిగా మానుకోవడమే. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను తయారు చేయబోమని, దానికి అవసరమైన సాంకేతికతను కూడా సమకూర్చుకోమని గట్టిగా హామీ ఇవ్వాలి. అదే మా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రధాన లక్ష్యం అని వాన్స్ స్పష్టం చేశారు. అయితే ఇరాన్ ఆ విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం వల్లే చర్చలు కొలిక్కి రాలేదు.

ఏకాభిప్రాయం కుదరలేదు

చర్చల సందర్భంగా ఇరాన్‌కు సంబంధించిన నిలిచిపోయిన ఆస్తులు  విడుదల చేయడంపై కూడా చర్చలు జరిగాయని వాన్స్ చెప్పారు. మరోవైపు, ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థల ప్రకారం.. సముద్ర మార్గంలో కీలకమైన హార్ముజ్ జలసంధి నియంత్రణ విషయంలో కూడా ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అమెరికా పెట్టిన షరతులు అన్యాయంగా ఉన్నాయని ఇరాన్ బృందం ఆరోపించింది.

తాము ఎంతో ఓపికగా, చర్చల ద్వారా సమస్య పరిష్కరించాలని ప్రయత్నించామని అమెరికా అంటోంది. అయితే చర్చలు విఫలమైతే తదుపరి ప్రణాళిక (ప్లాన్ బి) ఏంటని ప్రెసిడెంట్ ట్రంప్‌ను అడగ్గా, ఆయన చాలా ధీమాగా సమాధానమిచ్చారు. "మాకు ప్లాన్ బి అవసరం లేదు. ఇప్పటికే ఇరాన్ సైన్యం బలహీనపడింది, వారి తయారీ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. మా సైన్యం వారిని గట్టిగా దెబ్బకొట్టింది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అమెరికా పెట్టిన నిబంధనలను ఇరాన్ అంగీకరించకపోవడంతో ప్రస్తుతం ఉన్న రెండు వారాల కాల్పుల విరమణ తర్వాత మళ్ళీ యుద్ధం మొదలవుతుందా అన్న భయం ప్రపంచ దేశాల్లో నెలకొంది. తమ దేశ ప్రయోజనాలను కాపాడటం కోసమే అమెరికా మొండి కోర్కెలను తిరస్కరించామని ఇరాన్ ప్రతినిధులు స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు