/rtv/media/media_files/2026/05/02/ied-blast-2026-05-02-16-00-19.jpg)
bomb Blast
Terrorist attack : పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు ఘోరానికి తెగబడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో శనివారం జరిగిన ఒక భీకర ఆత్మాహుతి దాడిలో 15 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పాకిస్థాన్లోని వివాదస్పద ప్రాంతమైన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్, బన్నూ జిల్లా పరిధిలోని ఒక పోలీస్ చెక్పోస్టు లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి వ్యూహ రచన చేశారు. భారీగా పేలుడు పదార్థాలను నింపిన ఒక అనుమానాస్పద వ్యాన్ వేగంగా పోలీస్ పోస్టు వైపు దూసుకొచ్చింది. సరిహద్దు పోస్టు వద్ద విధుల్లో ఉన్న పోలీసులు సదరు వాహనాన్ని గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాదాన్ని శంకించిన భద్రతా సిబ్బంది ఆ వ్యాన్పైకి ఎదురుకాల్పులు ప్రారంభించారు. అయితే, ఈ క్రమంలో వాహనంలోని పేలుడు పదార్థాలు ఒక్కసారిగా భారీ తీవ్రతతో పేలిపోయాయి.
ఈ పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా కంపించిపోయింది. పేలుడు తీవ్రత ఎంత బలంగా ఉందంటే, అక్కడున్న పోలీస్ చెక్పోస్టు భవనం క్షణాల్లో పూర్తిగా కుప్పకూలి, నేలమట్టమైంది. శిథిలాల కింద చిక్కుకుని 15 మంది పోలీసులు అక్కడికక్కడే మరణించారు.ప్రమాదం జరిగిన వెంటనే అదనపు భద్రతా బలగాలు, అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కూలిపోయిన భవన శిథిలాల కింద నుంచి పోలీసులు, రెస్క్యూ సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనలో పలువురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని సైనిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
దాడి జరిగిన అనంతరం బన్నూ జిల్లా సరిహద్దులను మూసివేసి, ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.గత కొంతకాలంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్స్లలో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రదాడులు తీవ్రతరం కావడం గమనార్హం. ముఖ్యంగా నిషేధిత తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) వంటి ఉగ్రవాద సంస్థలు ఈ ప్రాంతాల్లో ఇలాంటి దాడులకు పాల్పడుతుంటాయి. తాజా ఘటనతో పాక్లో శాంతిభద్రతల పరిస్థితిపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Follow Us