/rtv/media/media_files/2025/03/07/FmFKOkOoAYDLfxg9FqbC.jpg)
Oil tanker hijacked in Hormuz, 17 held captive by Somali pirates
Strait of Hormuz : ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్మూజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, సముద్రపు దొంగలు (Pirates) మరోసారి పంజా విసిరారు. సోమాలియా తీరంలో ‘Honour 25’ అనే చమురు ట్యాంకర్ను హైజాక్ చేయడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హోర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య, సోమాలియా తీరంలో 'ఆనర్ 25' అనే చమురు ట్యాంకర్ను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఓడలో 17 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది.ప్రపంచ అస్థిరతను సముద్రపు దొంగలు అవకాశంగా తీసుకుంటున్నారని, మరింత చురుకుగా మారుతున్నారని, తద్వారా సముద్ర భద్రతకు, చమురు సరఫరాలకు ముప్పును కలిగిస్తున్నారని ఈ సంఘటన స్పష్టం చేస్తుంది.
బీబీసీ (BBC) నివేదికల ప్రకారం, ‘Honour 25’ అనే చమురు ట్యాంకర్ సోమాలియా తీరానికి సుమారు 30 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. బుధవారం అర్థరాత్రి ఆరుగురు సాయుధ దుండగులు తొలుత పడవపై వచ్చి ఓడను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత మరో ఐదుగురు సాయుధులు కూడా ఓడపైకి చేరారు.ప్రస్తుతం ఈ నౌకను సోమాలియా తీరంలోని జాఫున్ (Xaafun) బందర్ బెలా ప్రాంతాల మధ్య లంగరు వేయించి ఉంచారు.
హైజాక్కు గురైన ఈ నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారు. వారిలో పాకిస్తానీయులు: 10 మంది,ఇండోనేషియన్లు: 4 మంది,భారతీయుడు: 1 (ఒక్కరు) శ్రీలంక పౌరుడు: 1మయన్మార్ పౌరుడు: 1 ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్యాంకర్ సుమారు 18,500 బ్యారెళ్ల చమురుతో సోమాలియా రాజధాని మొగాడిషు వైపు వెళ్తోంది. గత కొన్ని రోజులుగా ఈ నౌక హోర్మూజ్ జలసంధి సమీపంలో సంచరించింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే అక్కడ పరిస్థితులు క్లిష్టంగా ఉండగా, ఇప్పుడు సోమాలియా సముద్రపు దొంగల దాడి చమురు సరఫరాపై మరింత ఆందోళన పెంచింది.గత మూడేళ్లలో సోమాలియా తీరంలో సముద్రపు దొంగతనాలు దాదాపుగా తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు మళ్లీ పెరిగినట్లు తెలుస్తోంది.
దీనికి ప్రధాన కారణం ప్రపంచ దేశాల నౌకాదళాలు ప్రస్తుతం హోర్మూజ్ జలసంధి,ఎర్ర సముద్రం (Red Sea) వద్ద ఉన్న ఉద్రిక్తతలపై దృష్టి సారించాయి. దీనిని అదునుగా తీసుకున్న దొంగలు భద్రతా లోపాలను వాడుకుంటున్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతల వల్ల ఇప్పటికే మొగాడిషులో పెట్రోల్ ధరలు మూడు రెట్లు పెరిగాయి. ఈ హైజాక్ ఘటన వల్ల చమురు కొరత మరింత తీవ్రమై ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది.ఈ నౌకలో అత్యధికులు పాకిస్థానీయులు ఉండటంతో ఆ దేశం తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ సముద్ర వ్యవహారాల మంత్రి జునైద్ అన్వర్ చౌదరి ఈ ఘటనపై సమగ్ర నివేదిక కోరారు. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాలని సంబంధిత సంస్థలను ఆదేశించారు.పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగి ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది.
నౌకలో ఒక భారతీయుడు కూడా ఉన్నందున, భారత ప్రభుత్వం, నౌకాదళం కూడా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాయి. సిబ్బంది క్షేమంగా తిరిగి రావడంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ ఘటన అంతర్జాతీయ సముద్ర భద్రతలో ఉన్న లొసుగులను ఎత్తిచూపుతోంది. అగ్రరాజ్యాల మధ్య ఉద్రిక్తతలు సముద్రపు దొంగలకు ఎలా వరంగా మారుతున్నాయో ఈ హైజాక్ ఒక స్పష్టమైన ఉదాహరణ.
Follow Us