/rtv/media/media_files/2026/06/01/nepal-2026-06-01-20-34-47.jpg)
నేపాల్ ప్రధాన మంత్రి బాలేన్ షా భారత్-నేపాల్ సరిహద్దు వివాదంపై పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు దేశాల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. వివాదాస్పద ప్రాంతాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా అంశాలపై ఆయన మొదటిసారి నోరు విప్పారు. ఈ సరిహద్దు వివాదంపై నేపాల్ కేవలం ఇండియా, చైనాలతోనే కాకుండా బ్రిటన్తో కూడా మాట్లాడిందని, ఈ విషయంలో బ్రిటన్ కూడా చొరవ చూపాలని బాలేన్ షా అనడం అంతటా కలకలం రేపింది. అసలు భారత్-నేపాల్ సరిహద్దు పంచాయితీలోకి బ్రిటన్ను లాగాలని నేపాల్ ప్రధాని ఎందుకు చూస్తున్నారు? దానికి భారత్ సమాధానం ఏంటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రధాని బాలేన్ షా వాదన ప్రకారం.. ఈ సరిహద్దు వివాదానికి అసలు మూలం 1816 నాటి సుగౌలీ ఒప్పందంలో ఉంది. ఆంగ్లో-నేపాల్ యుద్ధంలో నేపాల్ ఓడిపోయిన తర్వాత, అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో నేపాల్ ఈ ఒప్పందం చేసుకుంది. సరిహద్దుల గుర్తింపు అనేది బ్రిటిష్ పాలనలోనే జరిగింది కాబట్టి, ఈ సమస్య పరిష్కారంలో బ్రిటన్ కూడా భాగస్వామి కావాలని ఆయన వాదిస్తున్నారు. అయితే ఇండియా ఈ వాదనను మొదటి నుండి పూర్తిగా తిరస్కరిస్తోంది. కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా వివాదం అనేది కేవలం భారత్-నేపాల్ మధ్య ఉన్న ద్వైపాక్షిక అంశం మాత్రమేనని, ఇందులో మూడో దేశం జోక్యానికి అస్సలు తావులేదని ఢిల్లీ స్పష్టం చేసింది.
1814-16 లో జరిగిన ఆంగ్లో-నేపాల్ యుద్ధం ముగిశాక, 4 మార్చి 1816న సుగౌలీ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దీని ప్రకారం నేపాల్ తన ఆధీనంలోని కుమావున్, గఢ్వాల్, తారాయ్ ప్రాంతాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించింది. అలాగే మహాకాళి నదిని నేపాల్ పశ్చిమ సరిహద్దుగా గుర్తించారు. కానీ, ఈ కాళి నది అసలు ఎక్కడ పుట్టింది అనే విషయంలోనే ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు మొదటి నుండి ఉత్తరాఖండ్ లోని భాగాలేనని, దశాబ్దాలుగా అక్కడ భారత పరిపాలనా నియంత్రణే సాగుతోందని భారత్ పక్కా ఆధారాలతో చెబుతోంది.
బాలేన్ షా చేసిన వ్యాఖ్యలు భారత్లో కంటే నేపాల్ దేశం లోపలే పెద్ద రాజకీయ తుఫానును సృష్టించాయి. పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ.. "నేను ప్రధాని అయ్యాక నాకు ఒక విషయం తెలిసింది. కేవలం భారతదేశమే నేపాల్ భూభాగాన్ని ఆక్రమించలేదు, నేపాల్ కూడా కొన్ని చోట్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది" అని వ్యాఖ్యానించారు.
రంగంలోకి దిగి వివరణ
ఈ వివాదం మరీ ముదరడంతో నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి వివరణ ఇచ్చుకుంది. ప్రధాని అన్న మాటలు ప్రధాన సరిహద్దు వివాదాల గురించి కాదని.. నో-మ్యాన్స్ ల్యాండ్, నదుల ప్రవాహ మార్గాలు మారడం వల్ల స్థానికంగా తలెత్తే సమస్యలను ఉద్దేశించి అన్నవని సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ నేపాల్ రాజకీయాల్లో ఈ వేడి చల్లారడం లేదు. ఈ సమస్యకు అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కుదరదని, ఇరు దేశాల చరిత్రకారులు, సర్వేయర్లు, టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ సమక్షంలో నేరుగా చర్చల ద్వారానే పరిష్కారం వెతకాలని భారత్ గట్టిగా నమ్ముతోంది.
Follow Us