Bnei Menashe : ఇజ్రాయెల్‌కు చేరిన మణిపూర్ వాసులు...పూర్వీకుల గడ్డపైకి మరో 250 మంది 'బినియ్ మెనాషే' సభ్యులు

భారతదేశంలోని మణిపూర్, మిజోరాం రాష్ట్రాలకు చెందిన 'బినియ్ మెనాషే' (B’nei Menashe) యూదు కమ్యూనిటీకి చెందిన సుమారు 250 మంది సభ్యులు గురువారం రాత్రి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ చేరుకున్నారు.

New Update
FotoJet - 2026-04-27T193630.405

Manipur residents arrive in Israel

Bnei Menashe : భారతదేశంలోని మణిపూర్, మిజోరాం రాష్ట్రాలకు చెందిన 'బినియ్ మెనాషే' (B’nei Menashe) యూదు కమ్యూనిటీకి చెందిన సుమారు 250 మంది సభ్యులు గురువారం రాత్రి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ చేరుకున్నారు. బైబిల్ కాలం నాటి ఇజ్రాయెల్ పేర్కొన్న "పది తప్పిపోయిన తెగలలో" (Ten Lost Tribes of Israel) ఒకటైన 'మెనాషే' తెగకు తాము వారసులమని ఈ కమ్యూనిటీ వారు విశ్వసిస్తారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో మొదటి విడత తరలింపు

1990వ దశకం నుంచే వేలాది మంది బినియ్ మెనాషే సభ్యులు ఇజ్రాయెల్‌కు వలస వెళ్తున్నప్పటికీ, తాజాగా చేరుకున్న బృందం ప్రత్యేకం. ఎందుకంటే, ఇజ్రాయెల్ ప్రభుత్వమే అధికారికంగా చేపట్టిన తరలింపు కార్యక్రమంలో భాగంగా వచ్చిన మొదటి బృందం ఇది. గత ఏడాది నవంబర్‌లో ఇజ్రాయెల్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు, వీరికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి విమాన ఖర్చులు, నివాసం, హీబ్రూ భాషా తరగతులు,మతపరమైన మార్పిడి తరగతుల బాధ్యతను ప్రభుత్వం స్వీకరించింది.

ఎవరీ బినియ్ మెనాషే?

మణిపూర్, మిజోరాం రాష్ట్రాల్లోని మిజో, కుకీ తెగలకు చెందిన వీరి సంఖ్య సుమారు 7,000 వరకు ఉంటుంది. తమ పూర్వీకులు బైబిల్‌లో పేర్కొన్న మెనాషే తెగ వారసులని వీరు నమ్ముతారు. 'షవే ఇజ్రాయెల్' అనే ప్రైవేట్ సంస్థ సహకారంతో ఇప్పటివరకు సుమారు 4,000 మంది ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. 2006, 2007,2018 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున వలసలు జరిగాయి. సాధారణంగా ఇజ్రాయెల్ చట్టాల ప్రకారం వీరు నేరుగా యూదులుగా గుర్తించబడరు, అందుకే వీరి తరలింపునకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు అవసరమవుతాయి.

తరలింపు ప్రణాళిక - 2030 వరకు

టెల్ అవీవ్ విమానాశ్రయంలో ఈ బృందానికి ఇజ్రాయెల్ వలసల శాఖ మంత్రి ఓఫిర్ సోఫర్ స్వయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఏటా 1,200 మంది చొప్పున 2030 నాటికి ఈ కమ్యూనిటీ సభ్యులందరినీ ఇజ్రాయెల్‌కు తీసుకువస్తాం" అని ప్రకటించారు. రాబోయే వారాల్లో మరో 600 మంది, ఈ ఏడాది చివరికల్లా ఇంకో 600 మంది ఇక్కడికి చేరుకుంటారని 'డెగెల్ మెనాషే' సంస్థ వెల్లడించింది.

ఉత్తర ఇజ్రాయెల్‌లో ఆవాసం

కొత్తగా వచ్చిన ఈ 249 మందిని ఉత్తర ఇజ్రాయెల్‌లోని నోఫ్ హగలిల్ , కిర్యాత్ యామ్ వంటి ప్రాంతాల్లో స్థిరపరచనున్నారు. తమ పూర్వీకుల గడ్డకు చేరుకోవడంపై పలువురు సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడ వారు అధికారిక మతపరమైన ప్రక్రియలను పూర్తి చేసుకున్న తర్వాత వారికి పూర్తిస్థాయి ఇజ్రాయెల్ పౌరసత్వం లభిస్తుంది. భారతదేశంలో ఇంకా వేలాది మంది బినియ్ మెనాషే సభ్యులు ఇజ్రాయెల్ వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు