Kharg Island : నిండిన ఖర్గ్ ద్వీపం...‘డెడ్‌ ట్యాంకర్‌’ రంగంలోకి దింపిన ఇరాన్

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం మాటల యుద్ధానికే పరిమితం కాకుండా, ఒక తీవ్రమైన 'ఆర్థిక దిగ్బంధనం' దిశగా వెళ్లాయి. రెండు దేశాలు పట్టుదలలు వీడకపోవడంతో ఇరాన్ తన ప్రధాన ఆదాయ వనరు అయిన చమురు రంగంలో పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

New Update
FotoJet - 2026-04-27T213501.466

Kharg Island is full... Iran launches 'dead tanker'

Kharg Island :  అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం మాటల యుద్ధానికే పరిమితం కాకుండా, ఒక తీవ్రమైన 'ఆర్థిక దిగ్బంధనం' (Economic Blockade) దిశగా వెళ్లాయి. ఇరు దేశాలు యుద్ధం నుంచి బయటపడాలని చూస్తున్నప్పటికీ, పట్టుదలలు వీడకపోవడంతో ఇరాన్ తన ప్రధాన ఆదాయ వనరు అయిన చమురు రంగంలో పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

అమెరికా దిగ్బంధనం.. ఇరాన్ పట్టుదల

శాంతి ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ఎత్తేసే ప్రసక్తే లేదని అమెరికా తెగేసి చెబుతుండగా.. ఆ దిగ్బంధనం తొలగిస్తే తప్ప చర్చలకు వచ్చేది లేదని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఈ ప్రతిష్టంభన వల్ల ఇరాన్ చమురు ఎగుమతులు నిలిచిపోయి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే ఖర్గ్ ద్వీపం (Kharg Island) చమురు నిల్వలతో కిక్కిరిసిపోతోంది.

చమురు బావులు మూసేయలేని దుస్థితి

ఎగుమతులు లేవు కదా అని ఉత్పత్తిని నిలిపివేయడం ఇరాన్ కు సాధ్యం కావడం లేదు. చమురు బావుల నుండి ఉత్పత్తి ఆపితే సాంకేతిక సమస్యలు తలెత్తుతాయి:

పీడన సమస్య: బావుల్లో పీడనం తగ్గి, భూగర్భంలోని నీరు చమురు ఉన్న శిలల్లోకి చేరుతుంది. దీనివల్ల చమురు నాణ్యత దెబ్బతింటుంది.

శాశ్వత నష్టం: ఒకసారి మూసివేసిన బావులను మళ్ళీ తెరిచినప్పుడు చమురుకు బదులు నీరే వచ్చే ప్రమాదం ఉంది. ఇది బావుల జీవితకాల ఉత్పాదకతను శాశ్వతంగా దెబ్బతీస్తుంది.

ఖర్గ్ ద్వీపంలో నిండుతున్న నిల్వలు

ఇరాన్ చమురు ఎగుమతుల్లో90 శాతం వాటా కలిగిన ఖర్గ్ ద్వీపం ఇప్పుడు నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతోంది. ఈ ద్వీపం గరిష్టంగా 30 మిలియన్ బ్యారెళ్ల చమురును నిల్వ చేయగలదు. ప్రస్తుతం అక్కడ కేవలం 13 మిలియన్ బ్యారెళ్లకు మాత్రమే చోటు ఉంది.ఇరాన్ రోజువారీ ఉత్పత్తి1 మిలియన్ బ్యారెళ్లు కావడంతో, మరో రెండు వారాల్లో నిల్వ కేంద్రాలన్నీ నిండిపోయే పరిస్థితి ఉంది.

రంగంలోకి 'డెడ్ ట్యాంకర్లు'

స్టోరేజీ సమస్యను అధిగమించడానికి ఇరాన్ వినూత్న మార్గాలను వెతుకుతోంది. ఇందులో భాగంగా 30 ఏళ్ల క్రితం పక్కనపెట్టేసిన 'నషా ట్యాంకర్' (డెడ్ ట్యాంకర్) వంటి పాత నౌకలను మళ్ళీ వినియోగంలోకి తెస్తోంది. ఏప్రిల్ 16 నుండి ఖర్గ్ ద్వీపం నుంచి మూడు భారీ ట్యాంకర్లలోకి సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల చమురును లోడ్ చేసినట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. నిల్వ కోసం పాత ట్యాంకర్లను వాడుతుండటం చూస్తుంటే, ఇరాన్ ఇంకా కొంతకాలం వేచి చూసే ధోరణిలోనే ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆర్థికంగా దెబ్బతీయడమే అమెరికా వ్యూహం

ఇరాన్ చమురు నిల్వలు నిండిపోయి, బావులు మూతపడితే ఆ దేశ ప్రధాన ఆదాయానికి గండి పడుతుందని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ దిగ్బంధనం కేవలం సైనిక వ్యూహం మాత్రమే కాదు, ఇరాన్‌ను ఆర్థికంగా లొంగదీసుకునే భారీ ప్లాన్ అని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.

అమెరికా ఒత్తిడి ఇలాగే కొనసాగితే, మరో పదిహేను రోజుల్లో నిల్వ కేంద్రాలు పూర్తిగా నిండిపోయిన తర్వాత ఇరాన్ ఎలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisment
తాజా కథనాలు