గల్ఫ్ దేశాలకు ఇరాన్ బిగ్ ట్విస్ట్.. UNOలో నష్టపరిహారం డిమాండ్

ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్-అమెరికా యుద్ధం ప్రస్తుతం 46వ రోజుకు చేరుకుంది. యుద్ధం కారణంగా ఎదుర్కొన్న నష్టాలకు నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. మొదట్లో ఈ డిమాండ్ అమెరికాకు మాత్రమే పరిమితం కాగా, ఇప్పుడు అది అరబ్ దేశాలకు కూడా పాకింది.

New Update
_Gulf countries

ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్-అమెరికా యుద్ధం ప్రస్తుతం 46వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, శాంతి చర్చలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. తొలి విడత చర్చలు విఫలమైనా, యుద్ధాన్ని ముగించే దిశగా ఇరాన్ పెడుతున్న నిబంధనలు ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో చర్చనీయాంశంగా మారాయి.

గల్ఫ్ దేశాలపై ఇరాన్ నష్టపరిహారం డిమాండ్ 

యుద్ధం కారణంగా ఎదుర్కొన్న నష్టాలకు నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. మొదట్లో ఈ డిమాండ్ అమెరికాకు మాత్రమే పరిమితం కాగా, ఇప్పుడు అది అరబ్ దేశాలకు కూడా పాకింది. ముఖ్యంగా బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), జోర్డాన్ దేశాలు తమకు పరిహారం చెల్లించాలని ఇరాన్ ఐక్యరాజ్యసమితి వేదికగా డిమాండ్ చేసింది.

కారణం ఏమిటి?
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఈ ఐదు దేశాలు తమ భూభాగాన్ని, విమానాశ్రయాలను, సైనిక స్థావరాలను శత్రువులకు ఉపయోగించుకోవడానికి అనుమతించాయని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని, దీనివల్ల ఇరాన్ మౌలిక సదుపాయాలు ధ్వంసమై పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ పేర్కొన్నారు.

గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ ప్రతీకార దాడుల వల్ల కేవలం సైనిక స్థావరాలే కాకుండా, యూఏఈలోని దుబాయ్, అబుదాబి నగరాల్లో పౌర సదుపాయాలు, భవనాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. మరోవైపు, ఇరాన్ చేపట్టిన హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ప్రపంచ చమురు వాణిజ్యం అస్తవ్యస్తమై ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. యుద్ధానికి స్వస్తి పలకాలంటే ఇరాన్ ఈ కింది షరతులను ముందుంచింది.

ఇరాన్ విధిస్తున్న ప్రధాన షరతులు:

నష్టపరిహారం: యుద్ధం వల్ల జరిగిన భౌతిక, నైతిక నష్టాలకు పూర్తి పరిహారం చెల్లించాలి.
స్తంభింపజేసిన నిధులు: వివిధ దేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను తక్షణమే విడుదల చేయాలి.
హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ: ఈ జలసంధి ద్వారా వెళ్లే నౌకలపై టోల్ వసూలు చేసే హక్కు తమకే ఉండాలని, ఆ ఆదాయాన్ని దేశ పునర్నిర్మాణానికి వాడుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది.
భద్రతా హామీ: భవిష్యత్తులో అమెరికా తమపై ఎట్టి పరిస్థితుల్లోనూ దాడి చేయబోమని రాతపూర్వక హామీ ఇవ్వాలి.

అమెరికా కొన్ని షరతులకు పాక్షికంగా అంగీకరించినప్పటికీ, హోర్ముజ్ జలసంధిపై పట్టు కోల్పోవడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు తదుపరి పరిణామాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు