/rtv/media/media_files/2026/04/27/urenium-2026-04-27-13-13-09.jpg)
అగ్రరాజ్యం అమెరికాకు, ఇరాన్కు మధ్య జరుగుతున్న పోరులో యురేనియం కీలక పాత్ర పోషిస్తోంది. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వలను డొనాల్డ్ ట్రంప్ న్యూక్లియర్ డస్ట్ (అణు ధూళి) అని పిలుస్తారు. కేవలం వేరుశనగ గింజ పరిమాణంలో ఉండే ఈ యురేనియం గుళిక వేల ఇళ్లకు నెలల తరబడి విద్యుత్తును అందించగలదు. అయితే, దీనిని భూమి లోపలి నుండి బయటకు తీయడం వెనుక ఒక ప్రమాదకరమైన శాస్త్రం దాగి ఉంది.
ప్రపంచంలో అత్యధికంగా యురేనియం నిల్వలు ఆస్ట్రేలియా (28%) లో ఉన్నప్పటికీ, కెనడాలో లభించే యురేనియం అత్యంత నాణ్యమైనది. అయితే, కెనడాలో దీనిని వెలికితీయడం చాలా కష్టం. యురేనియం నిల్వలకు పైన ఇసుక పొరలు, నీరు ఉండటంతో మైనింగ్ చేస్తున్నప్పుడు గని మొత్తం నీటితో నిండిపోయే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించడానికి శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ గ్రౌండ్ ఫ్రీజింగ్ అనే టెక్నిక్ను వాడుతారు. భూమి లోపలికి వందలాది పైపులు వేసి, వాటి ద్వారా మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న కాల్షియం క్లోరైడ్ బ్రైన్ అనే ద్రవాన్ని పంపుతారు. ఇది భూమి లోపల ఒక భారీ మంచు గోడను నిర్మిస్తుంది. ఈ గోడ నీటిని అడ్డుకోగానే, రిమోట్ కంట్రోల్ మిషన్ల ద్వారా సురక్షితంగా యురేనియంను బయటకు తీస్తారు.
భూమి లోపల దొరికే సహజ యురేనియం నేరుగా శక్తిని ఇవ్వదు. దానిని యురేనియం ఎన్రిచ్మెంట్ (సంవర్ధనం) చేయాల్సి ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తి కోసం యురేనియంను కేవలం 3% నుండి 5% వరకు మాత్రమే సంవర్ధనం చేస్తారు. ఇది నియంత్రిత పద్ధతిలో శక్తిని విడుదల చేస్తుంది. ఒకవేళ దీనిని అణుబాంబుగా మార్చాలంటే 90% కంటే ఎక్కువ సంవర్ధనం చేయాలి. అందుకే ఇరాన్ చేస్తున్న ఈ ప్రక్రియపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
యురేనియం అణువుపై న్యూట్రాన్లను ప్రయోగించినప్పుడు, ఆ అణువు విడిపోతుంది. ఈ ప్రక్రియనే న్యూక్లియర్ ఫిషన్ అంటారు. ఈ సమయంలో అపారమైన శక్తి విడుదలవుతుంది. యురేనియం-235 అనే ఐసోటోప్ మాత్రమే ఈ ప్రక్రియకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. యురేనియం ఎంత శక్తివంతమైనదో అంత ప్రమాదకరమైనది కూడా. మైనింగ్ సమయంలో దాని ధూళి గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరితే క్యాన్సర్కు దారితీస్తుంది. అందుకే దీని వెలికితీతలో పొరపాట్లకు అస్సలు తావుండదు.
అమెరికా వాదన ప్రకారం.. ఇరాన్ విద్యుత్ కోసం యురేనియంను శుద్ధి చేస్తున్నామని చెబుతున్నా, అసలు లక్ష్యం మాత్రం అణుబాంబు తయారు చేయడమేనని ఆరోపిస్తుంది. ఇరాన్ లాంటి దేశం చేతికి అణుబాంబు చిక్కితే, అది ప్రపంచ శాంతికి, ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలకు పెద్ద ముప్పు అని అమెరికా భావిస్తోంది.
ఇరాన్తో ఒప్పందం
2015లో ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్తో ఒప్పందం జరిగింది. మీరు అణు కార్యక్రమాలను ఆపేయండి, మేము మీపై ఉన్న ఆర్థిక ఆంక్షలను తొలగిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ 2018లో డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చేశారు. ఇది చాలా చెత్త ఒప్పందమని, దీనివల్ల ఇరాన్ కేవలం తన అణు కార్యక్రమాన్ని వాయిదా వేసిందే తప్ప ఆపలేదని ఆయన వాదించారు. ఆ తర్వాత మళ్లీ కఠినమైన ఆంక్షలు విధించడంతో ఇరాన్ కోపం పెరిగింది. ఈ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్నాక, ఇరాన్ తన యురేనియం ఎన్రిచ్మెంట్ను వేగవంతం చేసింది. ఇప్పుడు వారు అణుబాంబుకు అవసరమైన 90% స్థాయికి చాలా దగ్గరలో (60% పైగా) ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. అమెరికా విధించిన ఆంక్షల వల్ల ఇరాన్ చమురును విదేశాలకు అమ్ముకోలేకపోతోంది. దీనివల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది.
ఇది కేవలం యురేనియం గొడవ మాత్రమే కాదు.. మధ్యప్రాచ్యంలో ఎవరు బాస్? అనే దానిపై జరుగుతున్న ఆధిపత్య పోరు. ఇరాన్ బాంబు తయారు చేస్తే, దాన్ని ఆపడానికి అమెరికా లేదా ఇజ్రాయెల్ సైనిక చర్యకు దిగే అవకాశం ఉంది, అదే జరిగితే అది మరో పెద్ద యుద్ధానికి దారితీయవచ్చు.
Follow Us