/rtv/media/media_files/2026/05/30/hormuz-2026-05-30-07-12-37.jpg)
ఇరాన్ యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత ఫిబ్రవరి 28 నుంచి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధి పూర్తిగా దిగ్బంధనంలో చిక్కుకుంది. ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఉండే ఈ ఇరుకైన సముద్ర మార్గం గుండానే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 శాతం ముడి చమురు, సహజ వాయువు సరఫరా అవుతుంటుంది. ఇక్కడ రవాణా నిలిచిపోవడంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి, ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఆసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత ఏర్పడుతుందేమోనన్న ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఏప్రిల్ 9న కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, ఈ జలసంధి మాత్రం ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. ఈ ప్రాంతంలో నౌకల రాకపోకలపై యుద్ధ ప్రభావం ఇప్పటికీ బలంగానే ఉంది.
ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఇండియాకు చెందిన పలు నౌకలు ఈ మార్గం గుండా సురక్షితంగా ప్రయాణిస్తుండటం విశేషం. ఈ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య కూడా భారత్ తన ఇంధన అవసరాలకు డోకా లేకుండా చమురు సరఫరాను నిరంతరాయంగా కొనసాగించగలుగుతోంది. హార్ముజ్ జలసంధి భౌగోళికంగా ఇరాన్కు అనుకూలంగా ఉండటం, ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతికారంగా ఇరాన్ ఈ మార్గంలో వెళ్లే నౌకలను లక్ష్యంగా చేసుకుంటుండటంతో భారత్ నౌకల ప్రయాణం ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆసక్తికర విషయాలు
శుక్రవారం జరిగిన అంతర్గత మంత్రిత్వ శాఖల సమావేశంలో షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారులు ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత నౌకలను ఎలా నడిపిస్తున్నారనే దానిపై కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పూర్తి వివరాలను మాత్రం వారు బయటపెట్టలేదు. ఈ సందర్భంగా పోర్ట్స్ మంత్రిత్వ శాఖ షిప్పింగ్ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. భారతదేశం, ఇరాన్ దేశాల మధ్య ఏ విధంగా సమన్వయం జరుగుతోంది, ఏ నౌకకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేది తాము విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారానే చూసుకుంటున్నామని, భద్రతా కారణాల వల్ల ఆ వ్యూహాలను పూర్తిగా వెల్లడించలేమని స్పష్టం చేశారు.
ఏ నౌకను ముందుగా పంపించాలనే ప్రాధాన్యతను పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ఎరువుల మంత్రిత్వ శాఖలతో కలిసి సంయుక్తంగా నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. ఈ మంత్రిత్వ శాఖల నుంచి వచ్చే అత్యవసర అవసరాల జాబితా ఆధారంగా ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేసి, దాని ప్రకారం నౌకలను సురక్షితంగా వెలుపలికి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని వివరించారు.
అధికారి ఓపేష్ కుమార్ శర్మ అందించిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి ప్రాంతంలో దాదాపు 13 భారతీయ జెండా కలిగిన నౌకలు ఉన్నాయి. వీటిలో ఒక ఎల్పీజీ ట్యాంకర్, ఐదు ముడి చమురు ట్యాంకర్లు, ఒక కెమికల్ ప్రొడక్ట్ ట్యాంకర్, మూడు కంటైనర్ నౌకలు, రెండు బల్క్ క్యారియర్లు, ఒక డ్రెడ్జర్ ఉన్నాయి. ఇంతటి ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ భారత్ ఈ మార్గంలో తన నౌకల రాకపోకలను విజయవంతంగా కొనసాగిస్తోంది.
Follow Us