భారతీయ నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి ఇండియా సీరియస్ వార్నింగ్!

హోర్ముజ్ జలసంధిలో భారతీయ చమురు నౌకలపై కాల్పులు కలకలం రేపాయి. ఇరాన్ ఆర్మీ రెండు ఇండియన్ షిప్‌పై ఫైరింగ్ చేయడంపై భారత్ సీరియస్‌గా తీసుకుంది. ఇరాన్ రాయబారి పిలిపించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రశ్నించారు.

New Update
_Foreign Ministry

ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు హోర్ముజ్ వైపు ఉత్కంఠగా చూస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిలో భారతీయ చమురు నౌకలపై కాల్పులు కలకలం రేపాయి. ఇరాన్ ఆర్మీ రెండు ఇండియన్ షిప్‌పై ఫైరింగ్ చేయడంపై భారత్ సీరియస్‌గా తీసుకుంది. వెంటనే ఇరాన్ రాయబారితో భారత్ సంప్రదింపులు జరిపింది. హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న రెండు భారత జెండా కలిగిన నౌకలపై అకస్మాత్తుగా చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నౌకల బ్రిడ్జి విండోలు దెబ్బతిన్నాయి. అయితే, అదృష్టవశాత్తూ సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని, సాంకేతిక నష్టం కూడా పెద్దగా లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి చెందిన గన్‌బోట్లు తమను సమీపించి కాల్పులు జరిపాయని ఒక ట్యాంకర్ కెప్టెన్ పేర్కొనడం గమనార్హం.

భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందించింది. ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీని పిలిపించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రశ్నించారు. భారతీయ పౌరుల భద్రత, సముద్ర వాణిజ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, నౌకల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇరాన్ అందించిన సహకారాన్ని గుర్తు చేస్తూనే, ప్రస్తుత పరిస్థితిపై భారత్ తన అసహనాన్ని వ్యక్తం చేసింది.

వైరల్ ఆడియో క్లిప్.. భయాందోళనలో సిబ్బంది

కాగా, ఈ ఉద్రిక్తతల మధ్య ఒక ఆడియో క్లిప్ బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది. అందులో ఒక భారతీయ నౌక సిబ్బంది సముద్ర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. "మీరు నాకు దారి ఇచ్చారు, ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు.. నన్ను వెనక్కి వెళ్లిపోనివ్వండి" అని ఆవేదన వ్యక్తం చేయడం అక్కడ ఉన్న భయానక పరిస్థితి తెలుపుతుంది. 

మరోవైపు, భారత్‌లో ఇరాన్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఎలాహి మాట్లాడుతూ, తమకు యుద్ధం వద్దని, శాంతిని కోరుకుంటున్నామని తెలిపారు. అయితే, ఇరాన్ నాయకులు మహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్ వంటి వారు అమెరికాపై చూపిస్తున్న కఠిన వైఖరి, అణు సమస్యపై ఒత్తిడికి లొంగబోమని చెప్పడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో హోర్ముజ్ జలసంధిది కీలక పాత్ర. ఇక్కడ రాకపోకలు నిలిచిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రస్తుతానికి ఈ మార్గంలో నౌకాయానం నిలిపివేయగా, రాబోయే రోజుల్లో దౌత్యపరమైన చర్చలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి. 

Advertisment
తాజా కథనాలు