/rtv/media/media_files/2026/06/02/iit-2026-06-02-19-43-32.jpg)
యూట్యూబ్ ప్రవచనాలు, మత్తు కలిపిన ప్రసాదం పేరుతో యువతులను లోంగదీసుకుని మోసాలకు పాల్పడిన ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ ఘోరకృత్యం మథురలో వెలుగుచూసింది. ఆధ్యాత్మిక గురువు అవతారమెత్తి యువతులపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, ఆ దృశ్యాలను వీడియోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడిన 29 ఏళ్ల కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒడిశాకు చెందిన అభిషేక్ మిశ్రా అనే యువకుడు 2017-2021 మధ్య కాలంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీ రూర్కీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అంత చదువు చదివిన అతను మంచి ఉద్యోగం చేసుకోకుండా.. ఆదికర్త నారాయణ్ దాస్ అనే పేరుతో ఆధ్యాత్మిక గురువుగా అవతారమెత్తాడు. గత నాలుగేళ్లుగా మథురలోని రాధాకుంజ్ ప్రాంతంలో ఉంటూ భాగవత కథలు చెప్పే కథావాచక్ గా చుట్టుపక్కల చలామణి అయ్యాడు.
తన భక్తి ప్రవచనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అభిషేక్ రాధా కృప అమృత పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ను నడిపేవాడు. అందులో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రవచనాలు చెబుతూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. చివరికి ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ అయిన లింక్డ్ఇన్ లో కూడా తన ఆధ్యాత్మిక పేరుతోనే ప్రొఫైల్ తెరిచాడు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా భక్తి పేరుతో యువతులను, ముఖ్యంగా ఇంజినీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేస్తూ వల విసిరేవాడు.
మెల్లగా బ్రెయిన్వాష్ చేసి
యూట్యూబ్ వీడియోల ద్వారా పరిచయమైన అమ్మాయిలను మెల్లగా బ్రెయిన్వాష్ చేసి.. వారి కుటుంబాలతో బంధాలు తెంచుకుని తన వద్దకు వచ్చేలా చేసేవాడు. అలా మథురలోని అతని ఇంట్లో దాదాపు 24 మంది యువతీ యువకులు ఉండేవారు. ఒకసారి అమ్మాయిలు అతని మాటల వలలో పడ్డాక.. గంధర్వ వివాహం చేసుకుందామంటూ నమ్మించి లోంగదీసుకునేవాడు. అంతేకాకుండా, ప్రసాదం పేరుతో మత్తుమందు కలిపిన పాలు ఇచ్చి.. వారు స్పృహ కోల్పోయాక లైంగిక దాడికి పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో మొబైల్లో నగ్న చిత్రాలు, వీడియోలు రికార్డ్ చేసి.. వాటిని చూపించి బాధితులను, వారి కుటుంబాలను బ్లాక్మెయిల్ చేసేవాడు.
తన ఇంట్లో ఉండే యువతుల కుటుంబాల నుండి భయపెట్టి డబ్బులు కూడా వసూలు చేసేవాడు. దాదాపు ఆరు నెలల క్రితం ఓ యువతి కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. అభిషేక్, అతని అనుచరులు పెద్ద గొడవ సృష్టించారు. అతని నడవడిక నచ్చక మొదట్లో అతనితోనే ఉన్న సొంత తల్లి కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మొదట అద్దె ఇంట్లో ఉన్న అభిషేక్.. భక్తులను మోసం చేసిన డబ్బుతో సొంతంగా ఒక పెద్ద ఇల్లు కూడా కట్టుకున్నాడు. అయితే రోజురోజుకూ అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో అక్కడున్న వాళ్లంతా మెల్లగా అతన్ని వదిలేసి వెళ్లిపోయారు.
చివరికి ఛత్తీస్గఢ్కు చెందిన ఒక బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణాలన్నీ వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అభిషేక్ మిశ్రాను మథుర పోలీసులు అరెస్ట్ చేసి అత్యాచారం కేసు నమోదు చేశారు. అతని మొబైల్ ఫోన్ నుండి అనేక అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఎంతమంది యువతులు ఇతని బారిన పడి మోసపోయారనే కోణంలో పోలీసులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Follow Us