/rtv/media/media_files/2026/03/27/police-2026-03-27-19-45-41.jpg)
మహారాష్ట్రలో ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్ తన తండ్రిని, ఆయన కూడా ఒక పోలీస్ ఆఫీసరే, అత్యంత కిరాతకంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2023 ఏప్రిల్ 25న చంద్రపూర్కు చెందిన పోలీస్ అధికారి జయంత్ బల్లవార్ (45) తన విధులకు వెళ్లే ముందు కూతురు ఆర్య ఇచ్చిన మిల్క్షేక్ తాగారు. ఆఫీసుకు వెళ్లిన కాసేపటికే ఆయన మైకంతో పడిపోయి మరణించారు. అప్పట్లో అది గుండెపోటు లేదా అనారోగ్యంతో జరిగిన సహజ మరణంగా భావించి పోలీసులు కేసును క్లోజ్ చేశారు. కానీ, మూడేళ్ల తర్వాత ఇప్పుడు అసలు నిజం బయటపడి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
పక్కా స్కెచ్
ఆర్య, ఆశిష్ షెడ్మాకే అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. వీరి పెళ్లికి తండ్రి జయంత్ బల్లవార్ అడ్డు చెప్పారు. తండ్రిని వదిలించుకుంటేనే తమ పెళ్లి సాధ్యమని భావించిన ఈ జంట, పక్కా స్కెచ్ వేసింది. తన బంధువుకు రూ. 5,000 ఇచ్చి విషం తెప్పించిన ఆర్య, ఆ విషాన్ని మిల్క్షేక్లో కలిపి తండ్రికి ఇచ్చింది. తండ్రి చనిపోయిన తర్వాత ఆర్య, ఆశిష్ వివాహం చేసుకున్నారు. అయితే, వీరి కాపురం ఎంతో కాలం సాఫీగా సాగలేదు. ఆశిష్ క్రమశిక్షణ లేని ప్రవర్తన వల్ల పోలీస్ ట్రైనింగ్ నుంచి అతడిని తొలగించారు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.
గత వారం భార్యతో గొడవ పడిన ఆశిష్, నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి అసలు నిజాన్ని కక్కేశాడు. మూడేళ్ల క్రితం తన భార్య తన తండ్రిని విషం ఇచ్చి చంపిందని, ఈ ప్లాన్లో తాను కూడా భాగస్వామినని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆర్య, ఆమె భర్త ఆశిష్, విషం తెచ్చిన ఆమె బంధువు చైతన్య, మరియు విషం సరఫరా చేసిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నలుగురూ పోలీసుల కస్టడీలో ఉన్నారు. కన్నతండ్రిని చంపి, అదే పోలీస్ శాఖలో పనిచేస్తున్న కూతురు చేసిన ఈ ఘాతుకం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
Follow Us