/rtv/media/media_files/2026/03/31/honeymoon-murder-case-2026-03-31-15-35-28.jpg)
గతేడాది మేఘాలయ అడవుల్లో హనీమూన్ సందర్భంగా దారుణ హత్యకు గురైన ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక అద్భుతమైన యాదృచ్ఛిక సంఘటన చోటుచేసుకుంది. రాజా రఘువంశీ మరణించిన సరిగ్గా ఏడాది తర్వాత, అదే తిథి రోజున ఆయన అన్నయ్య సచిన్కు కుమారుడు జన్మించడంతో, తమ కుమారుడే మళ్ళీ పుట్టాడని ఆ ఫ్యామిలీ అనుకుంటుంది.
రాజా ఈజ్ బ్యాక్
చనిపోయిన రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ తన మనవడి రాకపై భావోద్వేగానికి లోనయ్యారు. "నా కొడుకు మళ్ళీ తిరిగి వచ్చాడు" అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు. రాజా రఘువంశీ చంద్ర పక్షంలోని 11వ రోజైన 'గ్యారస్' (ఏకాదశి) నాడు హత్యకు గురికాగా, ఇప్పుడు సచిన్ కుమారుడు కూడా అదే 'గ్యారస్' తిథి నాడే జన్మించడం విశేషం. దీంతో ఆ శిశువుకు 'రాజా' అని పేరు పెట్టి, ఇంటి బయట "రాజా ఈజ్ బ్యాక్" అనే బెలూన్లతో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు.
హనీమూన్ హత్య
గతేడాది మే నెలలో రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ దంపతులు హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్కు వెళ్లారు. మే 26న వారు అదృశ్యమైనట్లు వార్తలు రాగా, పోలీసులు, NDRF బృందాలు సుదీర్ఘ గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు జూన్ 2న సోహ్రాలోని వెయ్ సావ్డాంగ్ జలపాతం సమీపంలోని లోతైన లోయలో రాజా మృతదేహం లభ్యమైంది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రాజా భార్య సోనమ్, రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అతడితో కలిసి భర్తను వదిలించుకోవాలని పథకం పన్నిందని తేలింది. హనీమూన్ నెపంతో రాజాను మేఘాలయకు తీసుకెళ్లి, సోనమ్ సమక్షంలోనే ముగ్గురు కిరాయి హంతకులు అతడిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో సోనమ్, రాజ్ కుష్వాహాతో పాటు విశాల్ సింగ్, ఆకాష్ సింగ్, ఆనంద్ కుర్మీ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కుమారుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రఘువంశీ కుటుంబానికి, ఈ చిన్నారి జననం ఒక దైవ ఆశీర్వాదంగా కనిపిస్తోంది. చట్టపరంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తూనే, తమ 'రాజా' మళ్ళీ తమ మధ్యకు వచ్చాడని వారు నమ్ముతున్నారు.
Follow Us