/rtv/media/media_files/2026/05/28/it-2026-05-28-18-36-28.jpg)
వ్యవసాయ రంగంపై మక్కువతో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఓ ఐటీ ప్రొఫెషనల్ను పిడుగుపాటు రూపంలో మృత్యువు కబళించింది. కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో జరిగిన ఈ దురదృష్టకర సంఘటనలో 43 ఏళ్ల రోషన్ బాలకృష్ణ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
మడికేరి పట్టణానికి చెందిన రోషన్ బాలకృష్ణ (43) ఇటీవలే తన ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తితో ఓ స్నేహితుడితో కలిసి సాగు పనులు ప్రారంభించారు. ఇంటి నుంచే పని చేస్తూ.. రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను మార్కెటింగ్ చేసే వ్యాపారాన్ని కూడా ఆయన చూసుకుంటున్నారు.
అకస్మాత్తుగా బలమైన పిడుగు
తన వ్యవసాయ వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ప్రణాళికలో భాగంగా, మైసూర్ పరిసరాల్లో ఓ భూమిని పరిశీలించడానికి రోషన్ తన భార్య, కుమారుడితో కలిసి బుధవారం అక్కడికి వెళ్లారు. భూమిని పరిశీలిస్తున్న సమయంలో అక్కడ ఓ మామిడి చెట్టు కనిపించింది. కాసేపు ఆగి మామిడి పండ్లను కోస్తుండగా.. అకస్మాత్తుగా బలమైన పిడుగు పడింది. ఈ ప్రమాదంలో రోషన్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. కళ్లముందే భర్త ప్రాణాలు కోల్పోవడంతో భార్యాపిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తూ అతనికి ప్రాణాపాయం తప్పిందని, గాయాలు పెద్దగా తీవ్రమైనవి కావని అధికారులు తెలిపారు.
బాధిత కుటుంబానికి మైసూర్ జిల్లా విపత్తు నిర్వహణ విభాగం తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. రోషన్ కుటుంబానికి మొత్తం రూ. 5 లక్షల పరిహారం అందించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఇందులో రూ. 4 లక్షలను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుండి, మిగిలిన రూ. 1 లక్షను జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) నుండి విడుదల చేయనున్నారు.
Follow Us