/rtv/media/media_files/2026/04/04/larry-ellison-2026-04-04-11-21-18.jpg)
టెక్ దిగ్గజం ఓరకిల్ కంపెనీ తన ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 నుండి 30 వేల మంది ఉద్యోగులను ఒక్కసారిగా పంపించేసింది. మార్చి 31న జరిగిన ఈ భారీ లేఆఫ్స్ వల్ల కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో సుమారు 18 శాతం మంది ఉపాధి కోల్పోయారు. ఈ ప్రభావం భారత్లో మరింత ఎక్కువగా ఉంది, సుమారు 12 వేల మంది భారతీయ ఉద్యోగులపై వేటు పడినట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, కేవలం ఒక ఈమెయిల్ పంపి ఉద్యోగాల నుంచి తొలగించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
ఆరు నెలల కాలంలోనే
ఒకవైపు ఉద్యోగులు రోడ్డున పడుతుంటే, మరోవైపు కంపెనీ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ ఆస్తి కూడా భారీగా కరిగిపోయింది. కేవలం ఆరు నెలల కాలంలోనే ఆయన ఏకంగా 193 బిలియన్ డాలర్ల (సుమారు ₹17.94 లక్షల కోట్లు) సంపదను కోల్పోయారు. 2025 సెప్టెంబర్లో ఆయన ఆస్తి 388 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2026 ఏప్రిల్ నాటికి అది 195 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీనివల్ల ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన ఒకప్పుడు మొదటి స్థానంలో ఉన్నా, ఇప్పుడు ఆరో స్థానానికి పడిపోయారు.
ఓరకిల్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది. దీనివల్ల కంపెనీపై అప్పుల భారం పెరగడం, లాభాల్లో తగ్గుదల కనిపించడంతో స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. సెప్టెంబర్ 2025లో $345 వద్ద ఉన్న షేరు విలువ, ఏప్రిల్ 2026 నాటికి 58% తగ్గి $146కు చేరుకుంది. లారీ ఎల్లిసన్కు కంపెనీలో 41% వాటా ఉండటంతో, షేర్ల పతనం ఆయన నెట్వర్త్ను అమాంతం తగ్గించేసింది.
ఒకప్పుడు ఎలోన్ మస్క్ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచిన లారీ ఎల్లిసన్, ఇప్పుడు తన స్థానాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ఎలోన్ మస్క్ 636 బిలియన్ డాలర్ల ఆస్థితో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, లారీ ఎల్లిసన్ మాత్రం ఆ భారీ నష్టాల నుంచి కోలుకునే ప్రయత్నంలో ఉన్నారు.
Follow Us