Foreign Relations: చురుకైన దౌత్య విధానం.. భారత్ వ్యూహాత్మక పయనం

ఇటీవల కాలంలో భారత్ దౌత్యపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ వ్యూహాత్యక విజయాలను అందుకుంటోందని అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బి.నాగరత్నం రెడ్డి అన్నారు. భారత్ బలమైన శక్తిగా ఆవిర్భవించడానికి G-7 లాంటి వేదికలు చాలా కీలకమన్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Foreign Relations: చురుకైన దౌత్య విధానం.. భారత్ వ్యూహాత్మక పయనం

India Foreign Policy: ఇటీవలి కాలంలో భారతదేశం అంతర్జాతీయంగా దౌత్యపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ, వాటిని సానుకూల అంశాలుగా మలుచుకొని చురుకైన దౌత్యవిధానంతో వ్యూహాత్యక విజయాలను అందుకుంటోంది. గత రెండు సంవత్సరాలుగా రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం దృష్టా రష్యా నుండి ఇందన దిగుమతులు నిలుపుదల చేయాలని పాశ్చాత్య దేశాలు మూకుమ్మడిగా భారత్ పై తీవ్ర ఒత్తిడి చేశాయి. అయినా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాశ్చాత్య దేశాల ఉచ్చులో పడకుండా అంతర్జాతీయ శాంతికి కట్టుబడి భారత ఇందన అవసరాలకై సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ ను మించి అత్యధికంగా రష్యా నుంచి డిస్కౌంట్ (Discount) రేటుకు చమురు దిగుమతి చేసుకుంది. భారతీయ వస్తువులను, సేవలను అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేయడంలో భారత విదేశాంగ విధానం అద్భుత విజయం సాధించింది. ఈ పరంపరలోనే ఇటీవల భారత్, ఇరాన్ తో చాబహార్ పోర్ట్ (ఓడరేవు) నిర్వహణకు సంబంధించి కీలకమైన వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం ఫలితంగా భారతదేశం, పొరుగు దేశమైన పాకిస్థాన్ ను బైపాస్ (Bypass) చేసి మధ్య ఆసియా రిపబ్లిక్ దేశాలై తుర్క్ మెనిస్థాన్, ఉజ్జగిస్తాన్, కిర్గిస్థాన్ వంటి చమురు సహజ వాయువు, హైడ్రోకార్బన్ నిక్షేపాలు అధికంగా గల దేశాలతో సంబంధాలు ఏర్పరచుకుంది. అలాగే ఇందన నిల్వలు దిగుమతి చేసుకోవడానికి, ఈ దేశాలతో సులభతర వాణిజ్యం నిర్వహించడానికి ఈ చాబహార్ పోర్ట్ కీలకపాత్ర పోషించనుంది. ఇరాన్ తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం పట్ల ఎప్పటిలాగే తన ఆదిపత్య ధోరణిని ప్రదర్శిస్తోంది. హెచ్చరికలు జారీచేసిన అమెరికా, ఇరాన్ తో ఒప్పందం కుదుర్చుకొనే దేశాలు లేదా సంస్థలు CAATSA చట్టాన్ని ఎదుర్కోవలసి వస్తుందని, తద్వారా అమెరికా విధించే ఆంక్షలను వర్తిస్తాయని హెచ్చరించింది.

భారతదేశం తన ద్వైపాక్షిక వ్యవహారాలలో స్వతంత్రంగా వ్యవహరించే పంథాలో పయనిస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా తాను విధించదలచిన ఆంక్షల గురించి హెచ్చరించే ముందు భారత వ్యతిరేక దేశాలలో తను చేస్తున్న కార్యకలాపాలు ముఖ్యంగా పాకిస్థాన్ F-16 వంటి యుద్ధ విమానాలు అందించడం, వాటి ఆధునీకరణకు సహకరించడం వంటి విషయాలను ఆత్మపరిశీలన చేసుకోవాలి. అయితే భారత్ విషయంలో CAA TSA చట్ట విధింపు గురించిన బెదిరింపు కొత్తేమి కాదు. గతంలో భారత్ రష్యా నుంచి S-400 మిస్సైల్స్ సిస్టమ్ కొనుగోలు చేసినపుడు కూడా అమెరికా ఇదే తరహాలో హెచ్చరించింది. కానీ మన దేశం తన స్వతంత్రత పట్ల గట్టిగా వ్యవహరించడం వలన మన దేశానికి CAATSA చట్ట వర్తింపు నుంచి మినహాయింపునిచ్చింది. ఫలితంగా రష్యా నుండి విజయవంతంగా S-400 Missile System అందుకోగలిగాం. ఈ పరిస్థితుల దరిమిలా ఆర్థికంగా, వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యత గల ప్రాంతం వలె ప్రత్యక్ష మార్గాలను అభివృద్ధి చేసుకోవడంతో ఏ మాత్రం వెనుకడుగు వేయరాదు. ఈ మార్గంలో చాబహార్ పోర్ట్ కంటే ముందే పలు ప్రయత్నాలు జరిగాయి. ఇండియా-పాక్-ఇరాన్ గ్యాస్ పైడ్లైన్ నిర్మాణానికి ప్రణాళికలు రచించబడినప్పటికీ, దాని వలన పాకిస్థాన్ లాభదాయకం అవుతోంది. అయినప్పటికీ తీవ్రవాద ముప్పు కారణంగా ఈ పైడ్లైన్ ప్రతిపాదన ఆగిపోయింది. తదుపరి ఇదే వరుసలో తుర్క్ మెనిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, పాక్, ఇండియా పైడ్లైన్ సహితం ప్రణాళికా దశలోనే ఆగిపోయింది.

మరో వైపు ఇరాన్ దేశంతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి, చాబహార్ వంటి ప్రాజెక్టులలో భాగస్వామ్యం ఏర్పరచడానికి చైనా ఆత్రుతతో ఎదురుచూస్తోంది. చైనా- పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణంలో భాగంగా చైనా ఇప్పటికే పాకిస్థాన్లో గ్వాదర్ పోర్ట్ నిర్మాణాన్ని పూర్తిచేస్తోంది. ఒకవేళ ఈ మార్గంలో భారత్ కు వ్యతిరేకంగా చైనా ప్రవేశిస్తే, భారత్ ఇంధన దౌత్యమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా సహితం చైనా బలపడటాన్ని వ్యతిరేకిస్తోంది. చైనాకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో భారత్ సహకారాన్ని కోరుతోంది. ఈ దిశగా ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్లతో కలిపి అమెరికా క్వాడ్ గ్రూపుతో కలిసి పయనిస్తోంది. ఇండియా, ఇజ్రాయిల్, USA, UAE లు కలిసి 1₂U₂గా పయనిస్తున్నాయి.

ఈ పరిస్థితుల దరిమిలా, చాబహార్ పోర్ట్ విషయంలో భారత్ ను మౌఖికంగా అమెరికా హెచ్చరిస్తున్నప్పటికీ, ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్య విస్తరణ ప్రమాద దృష్ట్యా, భారత్ పై CAATSA వర్తింపజేసే అవకాశం లేదు. కావున భారత్ మరింత దూకుడుగా, ఇరాన్ పశ్చిమాసియా ప్రాంతంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించడం ఆర్థికంగా, చమురు దౌత్యం పరంగానే కాకుండా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకం.

ఇజ్రాయిల్ - ఇరాన్ సంక్షోభం భారత్పై ప్రభావం :
మరోవైపు ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య రోజురోజుకి ముదురుతున్న ఘర్షణ వాతావరణం ఈ ప్రాంతంలో సుస్థిరతను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇజ్రాయిల్లో 20 వేల వరకు భారతీయులు ఉపాధి పొందుతున్నారని అంచనా. మరోవైపు ఇరాన్ లో కూడా వేల సంఖ్యలో భారతీయులు వివిధ వృత్తులలో ఉపాధి పొందుతున్నారు. దీనికి అదనంగా గల్ఫ్, WANA గా పిలువబడే పశ్చిమ ఆసియా- ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో, MENA గా పిలువబడే మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలలో 90 లక్షలకు పైగా భారతీయులు ఉపాధి పొందుతున్నారు.

ఈ ప్రాంతాలలో ఎటువంటి ఆటంకం ఏర్పడినా, వీరి ఉపాధి, జీవనం పై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. వీరందరినీ భారత్ కు తరలించవలసిన పరిస్థితి ఏర్పడితే, వీరికి ఆశ్రయం కల్పించడం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుతో కూడుకున్నది. దీనితో పాటు మన దేశానికి అందుతున్న రెమిటెన్సెస్ (చెల్లింపుల్లో) తగ్గుదల ఏర్పడుతుంది. వీటితోపాటు ఈ ప్రాంత సుస్థిరతతో మన దేశానికి చమురు సరఫరా ప్రత్యక్షంగా ముడిపడిన నేపథ్యంలో రెండుదేశాల మధ్య మరింత సమతౌల్యాన్ని అవలంభించి, ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య సాధారణ పరిస్థితులు ఏర్పరచడానికి భారత్ మరింత కీలకంగా వ్యవహరించాల్సి వుంది. ఈ విషయంలో ఇజ్రాయిల్ భారత్ కు ఆయుధ సరఫరాదారుగా చేరువవ్వడం, ఇరాన్ విశ్వాసప్రాయమైన భాగస్వామిగా ఉండడం వంటి అంశాలు భారత్ కి కలిసొచ్చే అంశాలు.

ఈ పరిస్థితులకు తోడు ఇటీవల హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రౌసీ మరణించాడు. ఈ సంక్షోభ సమయంలో భారత్ ఆ దేశంలో సుస్థిర పరిస్థితులు నెలకొల్పడంలో తనవంతు సహకారం అందించగా.. ఈ ప్రాంతంలో వ్యూహాత్మక జైత్రయాత్రను వేగవంతం చేయవలసి ఉంది.

G-7 భారత్ పాత్ర :
గత ఏడాది ఢిల్లీలో జరిగిన G-20 సదస్సు తరువాత వివిధ వేదికల్లో 'గ్లోబల్ సౌత్' అంశాన్ని లేవనెత్తడంలో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న G-7 సదస్సు భారత్ ప్రత్యేక ఆహ్వానిత దేశంగా హాజరైన నేపథ్యంలో, మూడవసారి ప్రధానిగా ఎన్నికయిన తరువాత తొలిసారి అంతర్జాతీయ వేదికపై సమకాలీన ప్రపంచ అంశాలైన కృత్రిమ మేధస్సు, ఇంధనం, వాతావరణ మార్పు, మధ్యధరా ప్రాంతం సంక్షోభం వంటి అంశాలపై మోడీ తన విలువైన భాగస్వామ్యముతమైన సహకారాన్ని అందించడానికి ముందుకొచ్చారు. ఆసియా ప్రాంతంలో చైనా దురాగతాలకు కళ్లెం వేసే క్రమంలో, ప్రధానమైన సమకాలీన అంశాలపై ప్రముఖపాత్ర వహించవలసిందిగా పాశ్చాత్య ప్రపంచం భారత్ వైపు చూస్తోంది.

G-7 సదస్సులో అంతర్జాతీయ అంశాలతో పాటు పలు దేశాలతో ముఖ్యంగా ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్ వంటి దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. "బలమైన శక్తి"గా ఆవిర్భవించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేయడం భవిష్యత్ భారత్ కి శుభసూచికం.

డా. బి.నాగరత్నం రెడ్డి
అసిస్టెంట్ ప్రొఫెసర్,
ప్రభుత్వ డిగ్రీ&పీజీ కళాశాల,
పలమనేరు.

Advertisment
Advertisment
తాజా కథనాలు