/rtv/media/media_files/2025/02/12/0q0k00NLBPuQzCwHGhwC.jpg)
YS Jagan RK Roja
వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజాకు చెక్ పెట్టేందుకు పార్టీలోని ఆమె ప్రత్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ కూడా దక్కకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారా? నగరి నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ గత కొన్ని రోజులుగా వైసీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. జగన్ కూడా ఇందుకు ఓకే చెప్పారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు అంటే ఫిబ్రవరి 12న జగన్ సమక్షంలో జగదీష్ వైసీపీ కండువా కప్పుకుంటారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే.. ఇందుకోసం జగదీశ్ మంగళవారమే విజయవాడ కూడా చేరుకున్నట్లు చర్చ జరిగింది. కానీ ఏమైందో కానీ ఆయన చేరిక జరగలేదు. అయితే.. జగదీష్ చేరికను రోజా అడ్డుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. జగదీష్ ను తీసుకువచ్చి నగరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా చేయాలన్నది రోజా ప్రత్యర్థుల వ్యూహంగా తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన రోజా.. ఇలా జరగడానికి వీళ్లేదని అధినేత, ముఖ్య నేతల వద్ద పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జగదీష్ చేరిక ఆగిపోయినట్లు తెలుస్తోంది.
గాలి కుటుంబానికి గట్టి పట్టు..
గాలి జగదీష్ తండ్రి ముద్దుకృష్ణమనాయుడు గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేయడంతో నియోజకవర్గంపై ఆయన కుటుంబానికి గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే ముద్దుకృష్ణమ కుమారుడు భాను ప్రకాష్ కు గత రెండు సార్లు నగరి నుంచి టీడీపీ టికెట్ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో భాను ప్రకాష్ ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రోజా విజయం సాధించారు. భాను ప్రకాష్ తమ్ముడు జగదీష్ తెరవెనుక వైసీపీకి మద్దతు ఇవ్వడంతోనే టీటీడీ ఆ ఎన్నికల్లో ఓటమి పాలైందన్న ప్రచారం కూడా ఉంది. గత ఎన్నికల్లో మాత్రం రోజా ఓటమి పాలై భాను ప్రకాష్ విజయం సాధించారు.
గాలి కుటుంబంలో విభేదాలు..
ముద్దు కృష్ణమనాయుడి మరణం తర్వాత గాలి కుటుంబం రెండుగా చీలిపోయింది. గాలి పెద్ద కుమారుడు భాను ప్రకాష్ ఒక వైపు, రెండో కుమారుడు జగదీష్, ఆయన తల్లి మరో వైపు ఉంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు సైతం ఈ ముగ్గురిపై సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. మీరు ఏకాభిప్రాయానికి రాకపోతే టికెట్ ను బయటి వారికి కేటాయించాల్సి వస్తుందని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు చర్చ సాగింది. అయితే.. మాలో ఎవరికి ఇచ్చినా ఓకే అని వీరు ఏకాభిప్రాయానికి రావడంతో చంద్రబాబు భాను ప్రకాష్ కు కేటాయించారు. ఈ ఎన్నికల్లో కూడా జగదీష్ పట్టుబట్టినా.. భాను ప్రకాష్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు.
జగన్ వ్యూహం అదే..
ప్రస్తుతం టికెట్ల అంశం పక్కకు పెట్టి నేతలంతా పార్టీ కోసం పని చేయాలని జగన్ స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానించాలని ఆయన నేతలకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో అప్పటి పరిస్థితులు, సర్వేల ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందని తేల్చి చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి జగదీష్ ను చేర్చుకోవడానికే జగన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
రోజా ఒప్పుకుంటారా?
జగదీష్ ను చేర్చుకోవడానికి మాజీ మంత్రి రోజా ఏ మాత్రం ఒప్పుకునే అవకాశం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఒక వేళ జగదీష్ ను చేర్చుకున్నా.. ఆయనను నగరికి దూరంగా ఉంచాలని.. మరేదైనా నియోజకవర్గ బాధ్యతలను ఆయనకు అప్పగించాలని ఆమె స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. అయితే.. వైసీపీ ముఖ్య నేతలు మరో ఒకట్రెండు రోజుల్లో రోజాతో చర్చలు జరిపి ఆమెను ఒప్పించనున్నట్లు తెలుస్తోంది.