/rtv/media/media_files/2024/11/15/F7eobRGKF62wJ5dazIwH.jpg)
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ హయాంలో కూటమిలోని కీలక నేతలపై సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా మాట్లాడిన కేసులో పోలీసులు ఇప్పటికే ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లలో మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు.
కొద్దీసేపటి క్రితమే పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్పై నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేట టూ టౌన్ సీఐ హేమారావు ఆధ్వర్యంలో పోసానిని నరసరావుపేటకు తరలిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని నరసరావుపేట పోలీసులకు జనసేన నేతల ఫిర్యాదు చేయడంపై పోసానిపై బీఎన్ ఎస్ యాక్ట్ 153-ఎ, 504, 67 ఐటీ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
అంతకుముందు రాజంపేట సబ్ జైల్ వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకోవడానికి ఏపీలోని మూడు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు సబ్ జైల్ వద్దకు వచ్చారు. నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించారు. తాము కోర్టు అనుమతి తీసుకున్నామని, ముందుగా పోసానిని తమకే అప్పగించాలంటూ నరసరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడిన జైలు సిబ్బంది నిబంధనలు పరిశీలించి నరసరావుపేట పోలీసులకు పోసానిని అప్పగించారు. దీంతో పోసాని లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
అస్వస్థతకు గురయ్యారని వార్తలు
పోసాని కృష్ణమురళి ఇటీవల అస్వస్థతకు గురయ్యారని వార్తలు వచ్చాయి. అయితే పోసాని అనారోగ్యంతో బాధపడడం ఒక డ్రామా అని అన్నారు రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు. ఉదయం నుంచి పోసాని అనారోగ్యమంటూ నాటకం ఆడారని తెలిపారు. పోసాని అడిగిన అన్ని టెస్టులు తాము చేయించామని అన్నారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రితో పాటుగా కడప రిమ్స్లో కూడా పరీక్షలు చేయించామని తెలిపారు. పోసానికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. దీంతో రిమ్స్ నుంచి తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలించామని వెల్లడించారు.
Also read : టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్