/rtv/media/media_files/2026/04/18/pawan-kalyan-2026-04-18-21-09-57.jpg)
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయనకు, వైద్యుల సూచన మేరకు అత్యవసరంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ఉదయం తన నివాసంలో అధికారులతో కలిసి పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తుండగా పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాస్తవానికి ఆయన గత కొన్ని నెలలుగా ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు
అస్వస్థత తీవ్రం కావడంతో, వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని ఆయన ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్కు ప్రాథమిక పరీక్షలతో పాటు ఎం.ఆర్.ఐ స్కాన్ కూడా నిర్వహించారు. నివేదికలను పరిశీలించిన వైద్య బృందం, జాప్యం చేయకుండా శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం. శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ కోలుకోవడానికి కనీసం వారం నుండి పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని డాక్టర్లు స్పష్టం చేశారు. పూర్తి స్వస్థత చేకూరడానికి మరికొంత సమయం పడుతుందని, ఆహారం ఇతర అలవాట్ల విషయంలో దీర్ఘకాలం పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీంతో ఆయన పది రోజుల పాటు అధికారిక, రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండనున్నారు.
Follow Us