TSPSC: జేఎల్ పరీక్షను రద్దు చేయండి.. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు..

టీఎస్‌పీఎస్‌సీ జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియమాకాలను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం 37 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా టీఎస్‌పీఎస్‌సీ ముందుకెళ్తోందని వారు ఆరోపించారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. తప్పు ప్రశ్నలపై వివరణ ఇవ్వాలని టీఎస్‌పీఎస్‌సీని ఆదేశించింది.

New Update
TSPSC: జేఎల్ పరీక్షను రద్దు చేయండి.. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు..

TSPCS JL Exam Updates: తెలంగాణలో ఏ ప్రభుత్వ ఉద్యోగానికి పరీక్షలు నిర్వహించినా.. కోర్టు దాకా వెళ్లకుండా ఫలితాలు రావడం లేదు. తప్పులను ఎత్తిచూపుతూ అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. తాజాగా జూనియర్ లెక్చరర్(JL) ఇంగ్లీష్ సబ్జెక్ట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) ఇటీవల నిర్వహించిన జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్‌(పేపర్-2)లో 150 ప్రశ్నలకు గాను 37 ప్రశ్నలు తప్పుగా ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పరీక్షలను రద్దు చేయాలని కోర్టును కోరారు. కాగా, ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. తప్పులపై వివరణ ఇవ్వాలంటూ టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. అనంతరం విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

జూనియర్ లెక్చరర్(జేఎల్) నియామకాల్లో భాగంగా సెప్టెంబర్ 12వ తేదీన రాత పరీక్ష నిర్వహించింది టీఎస్‌పీఎస్‌సీ. పేపర్‌-1 (జనరల్‌ స్టడీస్‌), పేపర్‌-2 (ఇంగ్లిష్‌) నిర్వహించారు. ఆ తరువాత సెప్టెంబరు 22న కీని విడుదల చేశారు. అయితే, ఇంగ్లిష్‌ పేపర్‌-2లో 37 ప్రశ్నలపై అభ్యంతరాలు లేవనెత్తారు అభ్యర్థులు. ఇంగ్లిష్‌ పేపర్‌లో పలు ప్రశ్నలు తప్పుగా ఉన్నాయన్నారు. దీనిపై వెబ్‌సైట్‌లో పిటిషనర్లు అభ్యంతరాలను వ్యక్తం చేయగా టీఎస్‌పీఎస్సీ పట్టించుకోకుండా తుది కీ విడుదల చేసింది. దాంతో ప్రశ్నలపై అభ్యంతరాలను టీఎస్‌పీఎస్సీ పట్టించుకోవడం లేదంటూ.. టి.ప్రణీత్‌రెడ్డి సహా మరో ఐదుగురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్‌ పి.మాధవీదేవి సోమవారం నాడు(అక్టోబర్ 30) విచారణ చేపట్టారు. తప్పులున్నాయని చెప్పినా పట్టించుకోకుండా తుది కీ విడుదల చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అభ్యర్థులు. ప్రశ్న పత్రంలో ఏకంగా 37 తప్పులున్నాయని, పరీక్షను రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. తప్పులపై వివరణ ఇవ్వాలంటూ టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. అయితే, పిటిషనర్ల ఆరోపణలపై వివరణ ఇవ్వడానికి గడువు కావాలని టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది రాంగోపాల్‌రావు కోరడంతో హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. అనంతరం విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

Also Read:

శరీరంలో గాయం మచ్చ పోవట్లేదా? జస్ట్ ఇలా చేస్తే చాలు మరక మాయం..!

ఈ రాశుల వారు వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కష్టాలు తప్పవు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు