Jeevan Reddy : జగిత్యాలలో తీవ్ర ఉత్కంఠ...నేడు కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి రాజీనామా?

జగిత్యాల కాంగ్రెస్‌ కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నాలుగు దశాబ్ధాలుగా కాంగ్రెస్‌లో కొనసాగిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత టీ. జీవన్‌ రెడ్డి నేడు పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన ముఖ్యకార్యకర్తలతో సమావేశం కానున్నారు.

New Update
Jeevan Reddy

Jeevan Reddy

Jeevan Reddy : జగిత్యాల కాంగ్రెస్‌ కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నాలుగు దశాబ్ధాలుగా కాంగ్రెస్‌లో కొనసాగిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత టీ. జీవన్‌ రెడ్డి నేడు పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో ఆయన తన అనుచరులు, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యకార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. అనంతరం ఆ సమావేశంలోనే రాజీనామా ప్రకటన చేయడంతో పాటు ఏ పార్టీలో చేరేది ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఆయన రాజీనామా అనంతరం బీఆర్‌ఎస్‌ నేతలతో ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్‌ ఆయనను స్వయంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దగ్గరకు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో సమావేశం అనంతరం పార్టీలో ఎప్పుడు చేరేది ప్రకటించనున్నారు. ఈ నెల 29న ఆయన బీఆర్‌ఎస్‌ లో చేరుతారని ఇప్పటికే ప్రచారం సాగుతోంది.

రోజంతా హైడ్రామా

కాగా ఈ నెల 25న కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని టీ.జీవన్‌ రెడ్డి ప్రకటించడంతో కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది. మంగళవారం రోజంతా జీవన్‌ రెడ్డి నివాసంలో హైడ్రామా నెలకొంది. ఆయన రాజీనామను వెనక్కుతీసుకునేలా ఒప్పించడం కోసం ఇటీవల మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు , అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ప్రయత్నించినప్పటికీ ఆయన వెనక్కు తగ్గకపోవడంతో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డితో ఆయన సమావేశం అయ్యారు.అయితే ఈ సందర్భంగా గత 20 నెలలుగా పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై జీవన్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు తనకు జరిగిన అవమానాలను ఆయన ముందు ఎకరవు పెట్టారు. పార్టీలో అవమానాలు భరించలేక  పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  
  
అయితే పీసీసీ అధ్యక్షునితో పాటు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మంగళవారం జీవన్‌ రెడ్డితో సమావేశమై చర్చలు సాగించినప్పటికీ ఆయన ససేమిరా అన్నారు. తన నిర్ణయంపై వెనక్కుతగ్గేది లేదని తేల్చి చెప్పారు. అనంతరం మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుంటారన్న విశ్వసాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎఐసీసీ కార్యదర్శ వంశీచంద్‌ రెడ్డి కూడా జీవన్‌ రెడ్డితో సమావేశమైనప్పటికీ ఆయన తన నిర్ణయంతో వెనక్కు తగ్గలేదు. దీంతో ఆయన ఈ రోజు రాజీనామా చేయడం ఖాయమని స్థానిక నాయకులు అంటున్నారు. దీంతో జీవన్‌ రెడ్డి ఇంటివద్ద ఉదయం నుంచే ఉత్కంఠ నెలకొంది.
 
నేను ఒక్కసారి చెబితే...

కాగా, జీవన్‌ రెడ్డి రాజీనామా చేస్తానని ప్రకటించిన అనంతరం ఆయన ఇంటివద్ద కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బ్యానర్లు, జెండాలను తొలగించారు. అయితే వాటి స్థానంలో ఏర్పాటు చేసిన పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో ఒకవైపు జీవన్‌రెడ్డి ఉంటే మరోవైపు ప్రముఖ నటుడు రజినీకాంత్‌ ఉన్నారు. పోస్టర్‌ మధ్యలో ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే..’ అన్న రజినీకాంత్‌ ఫేమస్‌ డైలాగ్‌ ఇంగ్లీషులో రాసి ఉంది. అంతేకాక దాని కింద ‘తెలంగాణ పొలిటికల్‌ సూపర్‌స్టార్‌ జీవన్‌రెడ్డి’ అని ఉండటం చర్చనీయంశంగా మారింది. జీవన్‌రెడ్డి ఒకసారి రాజీనామా నిర్ణయం తీసుకున్నాడంటే వెనక్కి తగ్గే వ్యక్తి కాదనే అర్థం వచ్చేలా ఈ పోస్టర్‌ ఏర్పాటు చేశారని కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు