/rtv/media/media_files/2026/06/03/cbse-2026-06-03-20-38-47.jpg)
తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల తారుమారుతో సంచలనం సృష్టించిన గ్లోబరినా సంస్థ నిర్లక్ష్యం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది. నాడు 29 మంది విద్యార్థుల బలితీసుకున్న ఆ సంస్థే.. ఇప్పుడు పేరు మార్చుకుని ఢిల్లీకి వెళ్లి సీబీఎస్ఈ పేపర్ వాల్యుయేషన్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ దారుణమైన దందాతో దేశవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మంది విద్యార్థుల కుటుంబాల జీవితాలు రోడ్డున పడ్డాయి. పరీక్షా ఫలితాల్లో జరిగిన ఘోర తప్పిదాల వల్ల ఇప్పటికే ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్దారు.
గతంలో తెలంగాణలో తీవ్ర దుమారం రేపిన గ్లోబరినా సంస్థ, వివాదాల తర్వాత తన పేరును కోయమ్ట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చుకుంది. హైదరాబాద్లోని మధురానగర్లో ఈ సంస్థకు హెడ్ ఆఫీస్ ఉంది. తెలంగాణ ఇంటర్ బోర్డును ముంచేసిన ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ.. ఈ సంస్థ మేనేజ్మెంట్ ఎలాంటి బ్లాక్లిస్ట్ కాకుండా తప్పించుకుని, డిజిటల్ పేపర్ కరెక్షన్ విభాగంలో సీబీఎస్ఈ లాంటి పెద్ద బోర్డు కాంట్రాక్ట్ను దక్కించుకోవడం గమనార్హం.
సాఫ్ట్వేర్ లోపాలు, అనుభవం లేని సిబ్బందితో పేపర్ వాల్యుయేషన్ చేయించడంతో సీబీఎస్ఈ ఫలితాల్లో భారీగా తప్పులు దొర్లాయి. బాగా చదివే విద్యార్థులకు కూడా సింగిల్ డిజిట్ మార్కులు రావడం, ఫెయిల్ అవ్వడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 18 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడింది. ఫలితాల ఒత్తిడి తట్టుకోలేక ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడం, దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవడంతో కోయమ్ట్ ఎడ్యుటెక్ కంపెనీ సీఈవో వీఎస్ఎన్ రాజు ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని పరారయ్యారు. మధురానగర్లో ఆఫీసులో కూడా ఆయన లేరు. స్టాప్ కూడా ఆయన ఎక్కడికి వెళ్లారో కూడా చెప్పడం లేదు. ఇక ఇండిపెండెంట్ హాస్ లో ఆఫీసు పెట్టుకుని 18 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు.
దాదాపు 99 లక్షల జవాబు పత్రాలను డిజిటల్గా స్కాన్ చేసి, కరెక్షన్ చేసే రూ. 384 కోట్ల భారీ కాంట్రాక్ట్ను హైదరాబాద్కు చెందిన కోయమ్ట్ ఎడ్యుటెక్ సంస్థకు కట్టబెట్టడం వెనుక ఎన్నో అనుమానాలు, సంచలన నిజాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ వ్యవహారంపై కోర్టులో పిటిషన్ వేయడంతో అసలు కథ వెలుగు చూసింది.
కాంట్రాక్ట్ ఎలా వచ్చిందంటే
CBSE 12వ తరగతి ఫలితాల్లో జరిగిన తారుమారు, విద్యార్థుల ఆత్మహత్యల వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు చేరింది.ఈ కాంట్రాక్ట్ కోసం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ కూడా పోటీ పడింది. అయితే టెక్నికల్ వాల్యుయేషన్లో టీసీఎస్కు 89 మార్కులు వస్తే.. కోయమ్ట్ సంస్థకు 91 మార్కులు ఇచ్చారు. లైవ్ డెమో, టెక్నికల్ ప్రెజెంటేషన్, కంపెనీ టర్నోవర్ విషయాల్లో టీసీఎస్ చాలా ముందున్నప్పటికీ.. గతంలో ఇలాంటి పేపర్లు స్కాన్ చేసిన అనుభవం అనే ఒకే ఒక్క కేటగిరీలో టీసీఎస్కు సున్నా మార్కులు ఇచ్చి, కోయమ్ట్ సంస్థకు ఫుల్ మార్కులు వేశారు. దీనివల్ల కోయమ్ట్ రేసులో ముందుకు వెళ్ళింది.
ఒక పేపర్ స్కానింగ్కు టీసీఎస్ రూ. 53 నుండి రూ. 65 కోట్ చేయగా.. కోయమ్ట్ సంస్థ కేవలం రూ. 24 నుండి రూ. 25 మాత్రమే కోట్ చేసింది. టీసీఎస్ మొత్తం కాంట్రాక్ట్ విలువ రూ. 951 కోట్లు చెబితే.. కోయమ్ట్ కేవలం రూ. 384 కోట్లకే చేస్తామని తక్కువ ధరకు టెండర్ వేసింది. తక్కువ ధర, టెక్నికల్గా ఒక్క మార్కు ఎక్కువ ఉండటంతో సీబీఎస్ఈ ఈ కాంట్రాక్ట్ను కోయమ్ట్ సంస్థకు అప్పగించింది.
పరీక్షలు ప్రారంభం కావడానికి కేవలం 74 రోజుల ముందు (డిసెంబర్ 5న) ఈ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. హడావుడిగా పని పూర్తి చేయడంతో సాఫ్ట్వేర్ లోపాలు తలెత్తాయి. మే 13న రిజల్ట్స్ వచ్చాక విద్యార్థులు తమ పేపర్లు చూసుకుంటే.. స్కాన్ చేసిన పేపర్లు మసకగా కనిపించడం, మార్కులు తప్పుగా వేయడం, కొన్ని పేపర్లు అసలు కనిపించకపోవడం వంటి ఘోరాలు జరిగాయి. ఫలితాలు తారుమారవడంతో కేవలం కొన్ని రోజుల్లోనే ఏకంగా 1,27,146 మంది విద్యార్థులు.. 3,87,399 జవాబు పత్రాలను రీ-వెరిఫికేషన్ చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. వెబ్సైట్ కూడా క్రాష్ అవ్వడంతో సీబీఎస్ఈ పదే పదే గడువు పెంచాల్సి వచ్చింది.
మరోవైపు దేశవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండటంతో.. కేంద్ర విద్యాశాఖ కూడా సీబీఎస్ఈని ఈ టెండర్ ప్రక్రియ, సైబర్ సెక్యూరిటీ లోపాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నిందితుడైన సంస్థ చైర్మన్ వీఎస్ఎన్ రాజు పరారీలో ఉండగా, కోర్టు తీర్పుపై ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.
Follow Us