TSPSC: రెండు లక్షల ఉద్యోగాల భర్తీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఈరోజు ఢిల్లీలో యూపీఎస్సీ ఛైర్మ‌న్ మ‌నోజ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు.TSPSC ప్ర‌క్షాళ‌న‌, UPSC ప‌ని తీరుపై వారు చ‌ర్చించారు. 2024 డిసెంబ‌ర్ నాటికి రెండు ల‌క్ష‌ల ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టాల‌ని సీఎం రేవంత్ ఆయనకు వివరించారు.

New Update
TSPSC: రెండు లక్షల ఉద్యోగాల భర్తీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాల‌యంలో యూపీఎస్సీ (UPSC) ఛైర్మ‌న్ డాక్ట‌ర్ మ‌నోజ్ సోని, కార్య‌ద‌ర్శి శ‌శిరంజ‌న్ కుమార్‌ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఈరోజు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్ర‌క్షాళ‌న‌, యూపీఎస్సీ ప‌ని తీరుపై సుమారు గంట‌న్న‌ర పాటు వారు చ‌ర్చించారు.

యూపీఎస్సీ పార‌ద‌ర్శ‌క‌త పాటిస్తోంద‌ని, అవినీతి మ‌ర‌క అంట‌లేద‌ని, ఇంత సుదీర్ఘ‌కాలంగా అంత స‌మ‌ర్థంగా యూపీఎస్సీ ప‌నిచేస్తున్న తీరుపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. తెలంగాణ‌లో నియామ‌క ప్ర‌క్రియ‌లో నూత‌న విధానాలు, ప‌ద్ధ‌తులు పాటించాల‌నుకుంటున్న‌ట్లు ముఖ్యమంత్రి తెలిపారు. స్పందించిన యూపీఎస్సీ ఛైర్మ‌న్ ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నియామ‌కాల ప్ర‌క్రియ‌పై దృష్టి సారించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. యూపీఎస్సీ ఛైర్మ‌న్‌, స‌భ్యుల నియామ‌కంలో రాజ‌కీయ ప్ర‌మేయం ఉండ‌ద‌ని, స‌మ‌ర్థత ఆధారంగా ఎంపిక ఉంటుంద‌ని తెలిపారు.

ALSO READ: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్!

2లక్షల ఉద్యోగాలు..

తాము 2024 డిసెంబ‌ర్ నాటికి రెండు ల‌క్ష‌ల ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టాల‌ని భావిస్తున్నామ‌ని, ఇందుకు టీఎస్‌పీఎస్సీని ప్ర‌క్షాళ‌న చేయాల‌నుకుంటున్నామ‌ని ముఖ్య‌మంత్రి, మంత్రి ఛైర్మ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. గ‌త ప్ర‌భుత్వం టీఎస్‌పీఎస్సీ ఛైర్మ‌న్‌, స‌భ్యుల నియామ‌కాన్ని రాజ‌కీయం చేసి, దానినో రాజ‌కీయ పున‌రావాస కేంద్రంగా మార్చింద‌న్నారు. ఫ‌లితంగా పేప‌ర్ లీకులు, నోటిఫికేష‌న్ల జారీ, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, ఫ‌లితాల వెల్ల‌డి ఓ ప్ర‌హ‌స‌నంగా మారింద‌న్నారు. నీళ్లు, నిధులు, నియామ‌కాలే ల‌క్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాట‌యింద‌ని, కానీ గ‌త ప్ర‌భుత్వ అస‌మ‌ర్థత‌తో నియామ‌కాల విష‌యంలో తీవ్ర నిర్ల‌క్ష్యం చోటు చేసుకుంద‌న్నారు. తామ రాజ‌కీయ ప్ర‌మేయం లేకుండా ఛైర్మ‌న్‌, స‌భ్యుల నియామ‌కం చేప‌డ‌తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

టీఎస్‌పీఎస్సీలో అవ‌క‌త‌వ‌కల‌కు తావులేకుండా సిబ్బందిని శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న నియ‌మిస్తామ‌ని వివ‌రించారు. స్పందించిన యూపీఎస్సీ ఛైర్మ‌న్ టీఎస్‌పీఎస్సీని యూపీఎస్సీ త‌ర‌హాలో తీర్చిదిద్దాల‌నుకుంటున్నందున టీఎస్‌పీఎస్సీ ఛైర్మ‌న్‌తో పాటు స‌భ్యుల‌కు తాము శిక్ష‌ణ ఇస్తామ‌ని, స‌చివాల‌య సిబ్బందికి అవ‌గాహ‌న త‌ర‌గతులు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీమతి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ముఖ్య కార్య‌ద‌ర్శి శ్రీ వి. శేషాద్రి, ఓఎస్డీ శ్రీ అజిత్ రెడ్డి, టీఎస్‌పీఎస్సీ కార్య‌ద‌ర్శి శ్రీమతి అనితా రామ‌చంద్ర‌న్, రాష్ట్ర అట‌వి, ప‌ర్యావ‌ర‌ణ శాఖ ముఖ్య‌ కార్య‌ద‌ర్శి శ్రీమతి వాణి ప్ర‌సాద్‌ పాల్గొన్నారు.

ALSO READ: APSRTC గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ పై 10 శాతం డిస్కౌంట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు