Prakash Raj : గవర్నర్ మీరు చేసేది తప్పు...ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్!

తమిళనాడు రాజకీయ సంక్షోభంపై నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ చేసిన వాదనను గవర్నర్ తోసిపుచ్చడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు.

New Update
prakash raj tweet

తమిళనాడు రాజకీయ సంక్షోభంపై నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ చేసిన వాదనను గవర్నర్ తోసిపుచ్చడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఆ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.  "గవర్నర్ ప్రవర్తన చాలా అసహ్యకరంగా ఉంది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు, పైగా రాజ్యాంగ విరుద్ధం. మనకు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు.. కానీ విజయ్‌కు ప్రజా తీర్పు ఉంది. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునే అవకాశం ఆయనకు ఇవ్వాలి" అని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. 

ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకే పార్టీకి 108 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. విజయ్ ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన 5గురు ఎమ్మెల్యేల మద్దతుతో కలిపి మొత్తం 113 మంది సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు సమర్పించారు. కానీ, గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మాత్రం ఖచ్చితంగా 118 మంది మద్దతు ఉంటేనే నేను ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇస్తానని భీష్మించుకుని కూర్చున్నారు.

సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు

విజయ్ కొద్దీసేపటి క్రితమే గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం తన వద్ద ఉందని,  తన బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకుంటానని విజయ్ వెల్లడించారు. ఒకవేళ గవర్నర్ నుంచి సానుకూలమైన నిర్ణయం రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు విజయ్ సిద్దపడుతున్నారు. దీంతో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. 

సాధారణంగా ఏ పార్టీకీ మెజార్టీ రానప్పుడు, అతిపెద్ద పార్టీని  ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి, అసెంబ్లీలో బలం నిరూపించుకోమని సమయం ఇవ్వడం ఆనవాయితీ. కానీ, ఇక్కడ గవర్నర్ ముందే పూర్తి సంఖ్యను చూపించమనడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ప్రకాష్ రాజ్ వంటి వారు దీనినే రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొంటున్నారు.

Advertisment
తాజా కథనాలు