60 దేశాలతో భారత్ దోస్తీ.. సరికొత్త వ్యూహంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా!

ప్రపంచ దేశాలతో సంబంధాలను మరింత పటిష్టం చేసే దిశగా భారత పార్లమెంట్ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా 'పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్స్' పేరుతో ప్రత్యేక బృందాలను ప్రకటించారు.

New Update
friendship groups

ప్రపంచ దేశాలతో సంబంధాలను మరింత పటిష్టం చేసే దిశగా భారత పార్లమెంట్ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా 'పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్స్' పేరుతో ప్రత్యేక బృందాలను ప్రకటించారు. మొత్తం 60 దేశాలతో ద్వైపాక్షిక బంధాలను మెరుగుపరచడం, భారత ప్రజాస్వామ్య గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడమే ఈ బృందాల లక్ష్యం.

అన్ని పార్టీల నేతలకు చోటు

ఈ టీంల స్పెషాలిటీ ఏంటంటే.. ఇందులో కేవలం అధికార పార్టీ ఎంపీలే కాకుండా, విపక్షాలకు చెందిన సీనియర్ నేతలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. రవిశంకర్ ప్రసాద్, చిదంబరం, అఖిలేష్ యాదవ్, అసదుద్దీన్ ఓవైసీ, శశి థరూర్, సుప్రియా సూలే, కనిమొళి వంటి దిగ్గజ నేతలు వివిధ దేశాలకు వెళ్లే బృందాలకు నాయకత్వం వహించనున్నారు. దేశ ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి విదేశీ దౌత్యంలో పాల్గొనడం విశేషం.

ఎక్కడెక్కడ పర్యటిస్తారు?
అమెరికా, రష్యా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ వంటి అగ్రరాజ్యాలతో పాటు శ్రీలంక, భూటాన్, నేపాల్, మాల్దీవుల వంటి పొరుగు దేశాల్లో కూడా ఈ బృందాలు పర్యటించనున్నాయి. అంతేకాకుండా సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, యూఏఈ, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి దేశాల శాసన వ్యవస్థలతో భారత పార్లమెంటరీ బృందాలు నేరుగా చర్చలు జరుపుతాయి. 

ప్రధాన ఉద్దేశం:

దౌత్య సంబంధాలు: ఇతర దేశాల పార్లమెంటరీ వ్యవస్థలతో సంబంధాలు పెంచుకోవడం ద్వారా దౌత్యపరమైన సత్సంబంధాలను మెరుగుపరచడం.

ప్రజాస్వామ్య ప్రచారం: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లోని పార్లమెంటరీ పనితీరును, చట్టసభల వ్యవస్థను ఇతర దేశాలకు వివరించడం.

అనుభవాల మార్పిడి: విదేశీ శాసన సభల్లో అమలువుతున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడం.

ఈ చొరవ వల్ల అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రభావం మరింత పెరుగుతుందని, ప్రపంచ దేశాల మధ్య సయోధ్య కుదురుతుందని లోక్‌సభ సెక్రటేరియేట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇది భారత విదేశాంగ విధానానికి పార్లమెంటరీ వ్యవస్థ ఇచ్చే అతిపెద్ద సహకారంగా నిలవనుంది.

Advertisment
తాజా కథనాలు