Induction stoves : గ్యాస్ సిలిండర్ల దెబ్బ..ఆన్‌లైన్లో ఇండక్షన్ స్టవ్లు ఔట్ ఆఫ్ స్టాక్!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను పరిశీలించగా ఇండక్షన్ కుక్‌టాప్‌ల లభ్యత గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన బ్లింకిట్‌లో దాదాపు అన్ని మోడల్స్ అందుబాటులో లేవు.

New Update
stove

గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇండక్షన్ కుక్‌టాప్‌లకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. అనేక నగరాల్లో ఎల్పీజీ (LPG) సిలిండర్ల లభ్యతపై నీలినీడలు కమ్ముకోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇండక్షన్ స్టవ్‌లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని, చాలా చోట్ల అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని తేలింది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను పరిశీలించగా ఇండక్షన్ కుక్‌టాప్‌ల లభ్యత గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన బ్లింకిట్‌లో దాదాపు అన్ని మోడల్స్ అందుబాటులో లేవు. అమెజాన్‌లో కెంట్, ఉషా వంటి కొన్ని బ్రాండ్లు మాత్రమే కనిపిస్తుండగా, మిగిలినవన్నీ నిండుకున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత కొద్ది రోజులుగా వీటికి విపరీతమైన డిమాండ్ పెరగడమే ఈ కొరతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

మూడు రెట్లు పెరిగాయి

టాటా గ్రూప్‌కు చెందిన క్రోమా రిటైల్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా ఇండక్షన్ కుక్‌టాప్‌ల విక్రయాలు మూడు రెట్లు పెరిగాయని వెల్లడించారు. అలాగే పిజియన్, గిల్మా వంటి బ్రాండ్లను విక్రయించే స్టవ్‌క్రాఫ్ట్ లిమిటెడ్, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల తర్వాత తమ ఆన్‌లైన్ అమ్మకాలు నాలుగు రెట్లు పెరిగాయని పేర్కొంది. గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారనే వార్తల నేపథ్యంలో, చాలా కుటుంబాలు ముందు జాగ్రత్తగా ఇండక్షన్ స్టవ్‌లను కొనుగోలు చేస్తున్నాయి.

ప్రభుత్వం మాత్రం దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని భరోసా ఇస్తోంది. బుకింగ్ చేసుకున్న 2.5 రోజుల్లోనే సిలిండర్ డెలివరీ అవుతోందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దేశీయ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా వాణిజ్య అవసరాల బుకింగ్స్‌పై ప్రభుత్వం నియంత్రణ విధించిందని తెలిపారు.

పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, భారత్‌కు అందే ముడి చమురు సరఫరా సురక్షితంగా ఉందని, మన దేశానికి అవసరమైన 70 శాతం చమురు హార్ముజ్ జలసంధి వెలుపలి మార్గాల నుండి వస్తోందని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఎల్పీజీ ఉత్పత్తి కూడా 25 శాతం పెరిగిందని ఆమె పేర్కొన్నారు. అధికారులు ఎన్ని హామీలు ఇస్తున్నప్పటికీ, వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళన వల్ల ఆన్‌లైన్ మార్కెట్‌లో ఇండక్షన్ కుక్‌టాప్‌ల కొరత మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు