బిహార్ భవిష్యత్ CM తేలనుంది ఆరోజే.. కొత్త ముఖ్యమంత్రిగా ఆయన పేరు!

రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ నెల 14న పాట్నాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో నూతన BJLP నేతను ఎన్నుకోనున్నారు. ఆ నేతే బిహార్ తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం.

New Update
_bihar next CM

బిహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత కొద్ది రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ రాష్ట్రంలో కీలక మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరందుకోవడంతో, అందరి దృష్టి ఇప్పుడు బిహార్‌పైనే ఉంది. రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్, ఇప్పటికీ ముఖ్యమంత్రి పీఠంపైనే కొనసాగుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

14న బీజేపీఎల్పీ కీలక భేటీ

రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ నెల 14న పాట్నాలో బీజేపీ శాసనసభాపక్ష (BJLP) సమావేశం జరగనుంది. ఈ భేటీలో నూతన బీజేఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. ఆ నేతే బిహార్ తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. నితీష్ కుమార్ తప్పుకుంటే, కూటమి ఒప్పందం ప్రకారం ఈసారి బీజేపీకి చెందిన నాయకుడే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

రంగంలోకి శివరాజ్ సింగ్ చౌహాన్

ఈ కీలక పరిణామాలను చక్కదిద్దేందుకు, నూతన ముఖ్యమంత్రి ఎంపికను పర్యవేక్షించేందుకు బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పరిశీలకుడిగా నియమించింది. బీజేఎల్పీ నేతను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం. పార్టీలోని అందరినీ సమన్వయపరిచి కొత్త సీఎం ఎంపికపై ఏకాభిప్రాయం తీసుకురావడం. కూటమిలో ఎలాంటి విభేదాలు రాకుండా నితీష్‌తో చర్చలు జరపడం వంటి బాధ్యతలను ఆయనకు అప్పగించారు.

నితీష్ నిర్ణయంపైనే ఉత్కంఠ

రాజ్యాంగం ప్రకారం నితీష్ కుమార్ మరో ఆరు నెలల పాటు సీఎంగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, 14న జరిగే బీజేపీ సమావేశం తర్వాత ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ తీసుకునే నిర్ణయం ఆధారంగానే నితీష్ రాజీనామా ముహూర్తం ఖరారు కానుంది. అయితే ఇప్పటి వరకు అటు జేడీయూ నుంచి కానీ, ఇటు బీజేపీ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కూటమిలో ఏం జరుగుతోంది?

నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకోవడంతోనే రాజ్యసభకు వెళ్లారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పగ్గాలను బీజేపీకి అప్పగించేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారా? లేదా ఇతర సమీకరణాలు ఏమైనా ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ 14న కొత్త నేత ఎన్నిక పూర్తయితే, బిహార్‌లో 'నితీష్ శకం' ముగిసి సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలవుతుంది.

Advertisment
తాజా కథనాలు