/rtv/media/media_files/2026/02/07/jail-2026-02-07-18-00-35.jpg)
చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు.. కానీ ఆ చట్టం ఇచ్చే తీర్పు రావడానికి ఒక మనిషి జీవిత కాలం పట్టింది. గుజరాత్కు చెందిన బాబూభాయ్ ప్రజాపతి అనే పోలీస్ కానిస్టేబుల్ కథ ఇది. కేవలం 20 రూపాయల లంచం కేసులో 30 ఏళ్ల పాటు తనపై పడ్డ నిందను మోస్తూ, చివరకు నిర్దోషిగా తేలి.. కన్నుమూశారు. 1996లో అహ్మదాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న బాబూభాయ్పై రూ. 20 లంచం తీసుకున్నారనే ఆరోపణతో కేసు నమోదైంది.
నాలుగేళ్ల జైలు శిక్ష
1997లో చార్జ్షీట్, 2002లో అభియోగాలు, 2004లో సెషన్స్ కోర్టు ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ బాబూభాయ్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ అప్పీలు ఏకంగా 22 ఏళ్ల పాటు పెండింగ్లో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సాక్షుల వాంగ్మూలాల్లో పొంతన లేదని, ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంటూ బాబూభాయ్ను నిర్దోషిగా ప్రకటించింది. తీర్పు వచ్చాక ఆయన తన లాయర్ ఆఫీసులో ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు.
కోర్టు నుంచి క్లీన్ చిట్ రావడంతో ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్లిన బాబూభాయ్, మరుసటి రోజే (ఫిబ్రవరి 5) గుండెపోటుతో మరణించారు. తనకు రావాల్సిన ప్రభుత్వ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోమని లాయర్ ఫోన్ చేసే లోపే ఆయన ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. 30 ఏళ్ల నిందను పోగొట్టుకున్నానన్న తృప్తితో ఆయన శాశ్వతంగా కన్నుమూశారు.
Follow Us