Jitta Balakrishna Reddy: రాజకీయ దురదృష్టవంతుడు జిట్టా.. జీవితమంతా పోరాటమే!

నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడిగా పేరున్న జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ రోజు కన్నుమూశారు. ఆస్తులమ్మి తెలంగాణ ఉద్యమం చేసిన జిట్టాకు.. స్వరాష్ట్రంలో ఒక్క పదవి కూడా దక్కలేదని ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పొలిటికల్ లైఫ్ పై స్పెషల్ స్టోరీ..

New Update
Jitta Balakrishna Reddy: రాజకీయ దురదృష్టవంతుడు జిట్టా.. జీవితమంతా పోరాటమే!

Jitta Balakrishna Reddy: అది 2009 ఎన్నికల సమయం.. నాటి సీఎం వైఎస్సార్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్టులు జట్టు కట్టారు. మరో వైపు మార్పు కోసమంటూ చిరంజీవి నాయకత్వంలో వచ్చిన ప్రజారాజ్యం పార్టీ సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో.. ముఖ్యంగా తెలంగాణ పాలిటిక్స్ లో అందరి దృష్టి భువనగిరిపై పడింది. ఇందుకు కారణం జిట్టా బాలకృష్ణారెడ్డి. యెన్నం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, రసమయి బాలకిషన్ లాంటి కీలక నేతలతో కలిసి కేసీఆర్ పై తిరుగుబాటు చేసిన జిట్టా.. భువనగిరి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. టీడీపీలో పొత్తులో భాగంగా భువనగిరి టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డికి కేటాయించడంతో ఆయన టీఆర్ఎస్ పై పోరాటానికి దిగారు. హోరాహోరీగా జరిగిన ఆ ఎన్నికల్లో ఆయన స్వల్పతేడాతో ఓటమి పాలయ్యారు.

అయితే.. ఆ ఎన్నికల్లో జిట్టా బాలకృష్ణారెడ్డి ఓటమి పాలైనా.. అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ సమయంలో నిరంతరం వార్తల్లో నిలిచారు. తెలంగాణ ఉద్యమం కోసం.. టీఆర్ఎస్ పార్టీ కోసం వందలాది మీటింగ్ లు పెట్టి.. కోట్ల కొద్దీ సొంత డబ్బులు ఖర్చు చేసి..నికార్సైన ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్న జిట్టా బాలకృష్ణారెడ్డి గెలవాలని అనేక మంది పార్టీలకు అతీతంగా కోరుకున్నారు. అయితే.. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన జిట్టా గుర్తులో కన్ఫూజన్ కారణంగా ఓడిపోయారన్న చర్చ కూడా ఉంది. ఏనాడైనా భువనగిరి గడ్డపై ఆయన ఎమ్మెల్యే అవుతారని అంతా భావించారు. కానీ అదృష్టం ఏనాడూ జిట్టాకు కలిసిరాలేదు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి 39,270 ఓట్లు సాధించి రెండో స్థానానికి పరిమితం అయ్యారు.

ఆ తర్వాత బీజేపీలోకి చేరి అదృష్టాన్ని పరీక్షించుకున్న జిట్టా మరోసారి ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో మార్పులు తేవాలన్న లక్ష్యంతో యువ తెలంగాణ పార్టీని స్థాపించిన జిట్టా కొద్ది రోజుల్లోనే దాన్ని బీజేపీలో విలీనం చేశారు. అయితే.. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తొలగించడం, తదనంతర పరిణామాలో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరారు. కానీ ఆ పార్టీలోనూ ఎక్కువ కాలం ఉండలేక పోయారు. అక్కడ కూడా తనకు టికెట్ వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో బయటకు వచ్చారు.

దాదాపు 14 ఏళ్లుగా తాను పోరాటం చేసిన తన పాత గురువు కేసీఆర్ వద్దకు 2023 ఎన్నికల ముందు చేరారు జిట్టా. అయితే.. ఆ ఎన్నికల్లో తన భువనగిరి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని బీఆర్ఎస్ ను బరిలోకి దించగా.. జిట్టా ఆయన గెలుపుకోసం పని చేశారు. ఆ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే.. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అయినా.. జిట్టాను బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతుందని అంతా భావించారు. కానీ.. బీసీ అభ్యర్థి మల్లేశంను ఆ పార్టీ అక్కడి నుంచి పోటీ చేయించింది.

తెలంగాణ ఉద్యమం కోసం సొంత ఆస్తులు కరగదీసుకున్న జిట్టా బాలకృష్ణారెడ్డిని రాజకీయ దురదృష్టవంతుడని అంటూ అంతా అతనిపై జాలి చూపిస్తుంటారు. రాజకీయాల్లోకి వచ్చి కోట్ల ఆస్తిని సంపాదించుకుంటున్న లీడర్లు ఉన్న ఈ రోజుల్లో ప్రజా సేవ కోసం లెక్కలేనంత సొంత డబ్బును ఆయన ఖర్చు చేశారు. అయినా.. ఒక్క ఛాన్స్ కూడా ఆయనకు దక్కలేదు.

అయితే.. 2009 లో టీఆర్ఎస్ నుంచి బయటకు రాకపోతే జిట్టా పొలిటికల్ లైఫ్ మరోలా ఉండేదన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించడంతో కీలక పాత్ర పోషించిన జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ రోజు ఉదయం అనారోగ్యంతో చనిపోవడంతో ఉద్యమకారులు, ఆయన సన్నిహితులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమ నేత అంతిమ సంస్కారాలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు