Middle East : పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు... ఇరాన్ డ్రోన్లు,రాడార్ సైట్లపై బాంబుల వర్షం..

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న వైరం తాజాగా మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి' పరిసర ప్రాంతాల్లో ఇరు దేశాల సైన్యాలు పరస్పరం దాడులకు దిగడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి చెలరేగాయి..

New Update
FotoJet - 2026-06-06T083740.030

Flames of war flare up again in West Asia... Iran bombs drones and radar sites.

Middle East : పశ్చిమాసియా (Middle East) అంతర్జాతీయ వేదికపై మరోసారి యుద్ధ మేఘాలు దట్టంగా ముసురుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న వైరం తాజాగా మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) పరిసర ప్రాంతాల్లో ఇరు దేశాల సైన్యాలు పరస్పరం దాడులకు దిగడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్‌ స్టేజ్‌కు చేరాయి. ఈ తాజా సైనిక చర్యల ఫలితంగా పశ్చిమాసియాలో ప్రస్తుతం అమలులో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా ప్రమాదంలో పడింది.

హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే అంతర్జాతీయ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన నాలుగు అత్యాధునిక డ్రోన్లను అమెరికా సైన్యం గగనతలంలోనే విజయవంతంగా కూల్చివేసింది. ఈ డ్రోన్ల వల్ల అంతర్జాతీయ నౌకాయానానికి తక్షణ ముప్పు పొంచి ఉందని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) స్పష్టం చేసింది. అంతటితో ఆగకుండా, మరిన్ని దాడులు జరగకుండా నిరోధించేందుకు ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ఇరాన్ తీరప్రాంతంలోని గోరుఖ్‌, ఖేష్మ్‌ ద్వీపాల్లో ఉన్న కీలక నిఘా రాడార్ కేంద్రాలే లక్ష్యంగా అమెరికా వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. తమ రక్షణ చర్యలు ఇలాగే కొనసాగుతాయని సెంటకామ్‌ సామాజిక మాధ్యమాల ద్వారా హెచ్చరించింది.

వాస్తవానికి ఇరాన్ ఈ ప్రాంతంలో చమురు సరఫరా మార్గాలపై పట్టు సాధించేందుకు నిరంతరం ప్రయత్నిస్తుండగా, అమెరికా ఆ దేశ రేవులు, ఇంధన రంగాన్ని ఆర్థికంగా దిగ్బంధిస్తోంది. ఈ ఘర్షణల నేపథ్యంలోనే, ఇరాన్ మద్దతుదారులు ఈ వారంలో కువైట్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కువైట్ ప్రధాన విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్‌పై జరిగిన దాడిలో ఒకరు మరణించగా, డజన్ల కొద్దీ ప్రయాణికులు గాయపడ్డారు. దీనివల్ల ఎయిర్‌ఫీల్డ్ తాత్కాలికంగా మూతపడింది. ఈ ఘటన తర్వాత బహ్రెయిన్‌లో కూడా ప్రమాద సైరన్‌లు మోగడంతో ఆ ప్రాంత సైనిక బలగాలు అప్రమత్తమయ్యాయి.

ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా సైన్యం కేవలం వైమానిక దాడులకే పరిమితం కాలేదు. హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న, ఇరాన్‌తో సంబంధాలున్న ఒక భారీ చమురు ట్యాంకర్‌ను అమెరికా నావికాదళం తమ ఆధీనంలోకి తీసుకుంది. అంతర్జాతీయ ఆంక్షల పరిధిలో ఉన్న చమురును అక్రమంగా విక్రయించడం ద్వారా ఇరాన్ ఆర్థిక ప్రయోజనాలు పొందకుండా అడ్డుకునేందుకే ఈ చర్య చేపట్టినట్లు అమెరికా వెల్లడించింది. దీనితో పాటు ఇరాన్ ఇంధన రంగానికి, అక్రమ చమురు రవాణాకు సహకరిస్తున్న పలువురు వ్యక్తులు, అంతర్జాతీయ సంస్థలపై అమెరికా ప్రభుత్వం కొత్తగా మరికొన్ని కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధించింది.

మరోవైపు, ఇరాన్-అమెరికా ఘర్షణల ప్రభావం లెబనాన్ సరిహద్దుల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, లెబనాన్ ప్రభుత్వాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇరాన్ మద్దతున్న హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ పూర్తిగా తిరస్కరించింది. దీనితో ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై విరుచుకుపడింది. శుక్రవారం జరిగిన ఈ భారీ బాంబు దాడుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దక్షిణ లెబనాన్‌లోని ఎక్కువ భాగాన్ని ఇజ్రాయెల్ సైన్యం తన అదుపులోకి తెచ్చుకుంది.

పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనాలన్నా, మూతపడిన హోర్ముజ్ జలసంధి మార్గం మళ్లీ తెరవబడాలన్నా.. ముందు లెబనాన్ భూభాగంపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని ఇరాన్ గట్టిగా పట్టుబడుతోంది. ఈ ఘర్షణలను ముగించేందుకు ఇరుదేశాల దౌత్యవేత్తల మధ్య తెరవెనుక చర్చలు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం దాడులు, ప్రతిదాడులు ఆగకపోవడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు