Nepal : నేపాల్‌లో మరో మాజీ ప్రధాని అరెస్ట్‌కు రంగం సిద్ధం!

నేపాల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. మాజీ ప్రధాని, నేపాలీ కాంగ్రెస్ సీనియర్ నేత షేర్ బహదూర్ దేవుబాపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

New Update
nepal

నేపాల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. మాజీ ప్రధాని, నేపాలీ కాంగ్రెస్ సీనియర్ నేత షేర్ బహదూర్ దేవుబాపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మనీ లాండరింగ్ దర్యాప్తు సంస్థ అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం దేవుబా మాత్రమే కాకుండా, ఆయన భార్య, మాజీ విదేశాంగ మంత్రి ఆర్జూ రాణా దేవుబాపై కూడా వారెంట్ జారీ కావడం గమనార్హం.

ప్రస్తుతం 79 ఏళ్ల దేవుబా తన భార్యతో కలిసి వైద్య చికిత్స కోసం విదేశాల్లో ఉన్నారు. ఈ వార్తలపై ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. "నా కుటుంబ ఆస్తులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నా జీవితం తెరిచిన పుస్తకం" అని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే వారిని రప్పించేందుకు పోలీసులు ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేసే ఆలోచనలో ఉన్నారు.

అవినీతిపై యుద్ధం ప్రకటిస్తూ

గతేడాది సెప్టెంబర్‌లో నేపాల్‌లో జరిగిన హింసాత్మక నిరసనల తర్వాత జరిగిన ఎన్నికల్లో 35 ఏళ్ల మాజీ ర్యాపర్ బాలేంద్ర షా అఖండ విజయం సాధించారు. అవినీతిపై యుద్ధం ప్రకటిస్తూ అధికారంలోకి వచ్చిన ఆయన ప్రభుత్వం, గత పాలకులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్‌లను అరెస్ట్ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు దేవుబాను టార్గెట్ చేసింది.

2025 సెప్టెంబర్‌లో అవినీతి, ఆర్థిక కష్టాలకు వ్యతిరేకంగా నేపాల్ యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఆ సమయంలో జరిగిన దాడుల్లో దేవుబా నివాసం కూడా దహనమైంది. ఆ సమయంలో ఆయన ఇంట్లో భారీగా నగదు దొరికినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. అయితే, ఆ వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సృష్టించినవని దేవుబా వాదిస్తున్నారు.  

Advertisment
తాజా కథనాలు