Israel Attacks Iran : ట్రంప్‌ హెచ్చరికలు బేఖాతరు: ఇరాన్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌.. పేలుళ్లతో దద్దరిల్లిన టెహ్రాన్‌!

పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి. తమ భూభాగంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) సోమవారం ఉదయం ఇరాన్ లోపలికి దూసుకెళ్లి మరి భీకరమైన వైమానిక దాడులకు దిగింది.

New Update
Israel Launches Retaliatory Airstrikes

Israel Attacks Iran

 Israel Attacks Iran : పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి. అంతర్జాతీయ సమాజం ఎంత చెప్తున్నా, చివరకు మిత్రదేశమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా హెచ్చరిస్తున్నా ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ భూభాగంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) సోమవారం ఉదయం ఇరాన్ లోపలికి దూసుకెళ్లి మరి భీకరమైన వైమానిక దాడులకు దిగింది. పశ్చిమ, మధ్య ఇరాన్‌లోని ఇరానియన్ పాలనకు చెందిన సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF) కొద్దిసేపటి క్రితమే విజయవంతంగా దాడులు పూర్తి చేసిందని ఐడీఎఫ్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

ఈ దాడుల నేపథ్యంలో అమెరికా ఒత్తిడిని ఇజ్రాయెల్ పూర్తిగా పక్కనబెట్టినట్లయింది. ఇరాన్ క్షిపణి దాడులు చేసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడారు. శాంతి ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని గుర్తుచేస్తూ, ఇరాన్‌పై ఎలాంటి ఎదురుదాడి చేయవద్దని, ఇరుపక్షాలకూ ఇప్పటికే సరిపడా నష్టం జరిగిందని సూచించారు. "వారి దాడిలో ఎవరికీ ఏమీ కాలేదు, ఇజ్రాయెల్ ప్రతిదాడి చేయదని ఆశిస్తున్నా. ఒకవేళ ప్రతిదాడి చేస్తే గత 47 ఏళ్ల నుంచి జరుగుతున్న హింసే కొనసాగుతుంది" అని ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ నెతన్యాహు ప్రభుత్వం ఆ మాటలను లెక్కచేయకుండా నేరుగా సైనిక చర్యకు దిగడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.

వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా..

ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ప్రధానంగా ఇరాన్ సైన్యానికి సంబంధించిన కీలక క్షిపణి కేంద్రాలు, డ్రోన్ తయారీ స్థావరాలు, రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డాయి. ఈ దాడుల ధాటికి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో పలుచోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. టెహ్రాన్‌తో పాటు ఇస్ఫహాన్‌, తబ్రిజ్‌, కరాజ్ వంటి ప్రముఖ నగరాలు కూడా పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లాయి. ఈ దాడులకు ఇజ్రాయెల్ అత్యాధునిక 'ఎయిర్ లాంచ్‌డ్ బాలిస్టిక్ క్షిపణులను' వాడినట్లు ఇరాన్ ఆరోపించింది. ఇజ్రాయెల్ దాడుల తీవ్రత కారణంగా ఇరాన్ ప్రభుత్వం తమ దేశ గగనతలాన్ని (ఎయిర్‌స్పేస్) తక్షణమే మూసివేసింది.

అసలు ఈ తాజా ఘర్షణలకు ఆదివారం అర్ధరాత్రి ఇరాన్ చేసిన దాడులే కారణం. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతిచర్యగా.. ఏప్రిల్‌ 8 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ ఆదివారం అర్ధరాత్రి దాదాపు 10 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర ఇజ్రాయెల్ వైపు ప్రయోగించింది. దాంతో ఇజ్రాయెల్ అంతటా ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగడంతో లక్షలాది మంది ప్రజలు బంకర్లలో ఆశ్రయం పొందారు. అయితే, ఆ క్షిపణులన్నింటినీ ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు గాల్లోనే అడ్డుకున్నాయి. ఇరాన్‌తో పాటు ఇరాక్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి కూడా తమపై దాడులు జరిగాయని ఐడీఎఫ్ పేర్కొంది.

సంయమనం పాటించాలన్న బ్రిటన్

ఇరాన్ దాడుల తర్వాత అటు లండన్ (బ్రిటన్) సైతం స్పందించింది. బ్రిటన్ విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ ఇరు దేశాలూ అత్యంత సంయమనం పాటించాలని, ప్రాంతీయ శాంతి దృష్ట్యా ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరారు. అయితే, ఇరాన్ క్షిపణి ప్రయోగంపై "ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసింది, దీనికి తగిన శాస్తి జరుగుతుంది" అని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ హెచ్చరించారు. అనుకున్నట్లుగానే, అమెరికా, బ్రిటన్ దేశాల దౌత్యపరమైన విజ్ఞప్తులను తోసిరాజని ఇజ్రాయెల్ తన ప్రతీకారాన్ని తీర్చుకుంది.

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఈ పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్‌తో పాటు ఖతార్‌, సిరియా దేశాలు కూడా ఇప్పటికే తమ గగనతలాన్ని మూసివేయడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒకవేళ ఇరాన్ గనుక ఇజ్రాయెల్ తాజా వైమానిక దాడులపై మళ్లీ ఎదురుదాడికి దిగితే.. పశ్చిమాసియా ప్రాంతం పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధంలోకి నెట్టబడుతుందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ,చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు