/rtv/media/media_files/2026/03/16/mojtaba-khamenei-2026-03-16-18-35-54.jpg)
Mojtaba Khamenei
Mojtaba Khamenei : ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా జరుపుతున్న యుద్ధం మూడువారాలకు చేరుకుంది. అయినా ఇరాన్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇరాన్ పై దాడి చేస్తామని చెప్పిన ఇజ్రాయెల్, అమెరికా తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని అంతం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తృటిలో ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి28న టెహ్రాన్పై జరిగిన వైమానిక దాడి నుంచి ఖమేనీ కుమారుడు, కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా తృటిలో బయట పడినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఆ రోజు వారంతా ఉన్న భవనంపై క్షిపణులతో దాడి జరగడానికి కొంది క్షణాల ముందే మొజ్తబా అక్కడి నుంచి వెళ్లి పోయినట్లు ది టెలిగ్రాఫ్ కథనం వెల్లడించింది. దాడి జరిగిన ప్రాంతానికి కొంత దూరంలో మొజ్తబా ఉండటంతో ఆయన మృత్యువు నుండి తప్పించుకున్నాడు. కానీ, ఆయన తండ్రితో పాటు ఇతర కుటుంబ సభ్యులు మరణించారు.
కాగా, టెలిగ్రాఫ్ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం దాడి జరగడానికి కొన్ని క్షణాల ముందే ఆయన బయటకు వెళ్లడం, క్షణాల్లోనే క్షిపణి ఆ భవనాన్ని తాకడం ఒకేసారి అయ్యాయని కథనం తెలిపింది. ఆనాటి దాడిలో ఇరాన్ సైనిక అధికారులు మొహమ్మద్ షిరాజీ కూడా మరణించారు. క్షిపణి దాడితో అక్కడ భారీ విధ్వంసం జరిగిందని కథనం వెల్లడించింది. అయితే ఇదంతా ఒక ఆడియో లీక్ వల్ల బయటి ప్రపంచానికి తెలిసిందని కథనంలో రాసుకొచ్చారు. “మొజ్తబా ఏదో పని మీద ఆవరణలోకి వెళ్లి, ఆ తర్వాత తిరిగి రావడమే దైవ సంకల్పం,” అని ఖమేనీ కార్యాలయ ప్రోటోకాల్ అధిపతి మజాహెర్ హొస్సేనీ, ఇరాన్ అధికారులతో ఒక ప్రైవేట్ సమావేశంలో చెప్పినట్లు ‘ది టెలిగ్రాఫ్’ తన కథనంలో తెలిపింది.
అమెరికా-ఇజ్రాయెల్ ఆ భవనంపై జరిపిన దాడుల్లో మూడు క్షిపణులు తాకాయని, అందులో ఒకటి అలీఖమేనీ సమావేశం జరుగుతున్న ప్రాంతాన్ని తాకగా.. మరొకటి పైన అంతస్తులో ఉన్న మొజ్తాబా నివాసంపై పడినట్లు తెలిపింది. ఈ దాడిలో మొజ్తాబా కాలికి స్వల్ప గాయమైందని హొస్సేనీ చెప్పినట్లు ఆడియోలో ఉందని ఉటంకించింది. ఇక, మూడో క్షిపణి ఇదే ప్రాంగణంలో ఉన్న ఖమేనీ అల్లుడు మిస్బా అల్ హుడా బఘేరీ నివాసంపై పడింది. దాని తీవ్రతకు మిస్బా శరీరం ఛిద్రమైందని హొస్సేనీ చెప్పినట్లు మీడియా కథనం పేర్కొంది. ఈ క్షిపణి దాడి మూలంగా డెడ్ బాడీలన్నీ గుర్తించలేని విధంగా తయారైనట్లు టెలిగ్రాఫ్ చెప్పింది.
ఈ దాడిలో అలీ ఖమేనీతో పాటు ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, కోడలు, ఇతర కుటుంబసభ్యులు మరణించినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అదే సమయంలో మొజ్తాబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డాడని, ఆయన ప్రాణాలతో ఉండే అవకాశం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను ఇరాన్ ఖండించింది. మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంగానే ఉన్నారని ఇరాన్ మీడియా కథనాలు వెల్లడించాయి.
Follow Us