MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు(శుక్రవారం) విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఆమె బినామిగా పేర్కొంటున్న రామచంద్రన్ పిళ్లై అప్రూవర్‌గా మారిన వెంటనే నోటీసులు రావడం చర్చనీయాంశమైంది.

New Update
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు

ED Notice To MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు(శుక్రవారం) విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఆమె బినామిగా పేర్కొంటున్న రామచంద్రన్ పిళ్లై అప్రూవర్‌గా మారిన వెంటనే నోటీసులు రావడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కవిత నిజామాబాద్ పర్యటనలో ఉన్నారు. హైదరాబాద్ వచ్చాక రేపు విచారణకు హాజరు కానున్నారో లేదోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కవిత మార్చి 16, 20, 21వ తేదీల్లో మూడు సార్లు ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అప్పుడు ఆమెను దాదాపు అరెస్ట్ చేస్తారనే వార్తలు జోరందుకున్నాయి. కానీ అలా జరగలేదు.

అంతేకాకుండా అప్పటి నుంచి కవిత విచారణ కూడా ఆగిపోయింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో ఆమె బినామి పిళ్లై అప్రూవర్‌గా మారడం ఆ వెంటనే కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సారి విచారణ సందర్భంగా ఆమెను అరెస్ట్ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి కవిత ఈడీ విచారణకు హాజరవుతుందా? ఏదైనా కారణాలతో వాయిదా కోరుతుందా? అని సందేహాలు వెలువడుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వచ్చిన తరువాత తెలంగాణలో కమలం పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ప్రజల్లో రెండు పార్టీలు ఒక్కటేనని బలంగా వెళ్లినట్లు బీజేపీ పెద్దలకు సీక్రెట్ రిపోర్టు అందినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మళ్లీ బీజేపీ బలం పెంచుకునేలా నోటీసులు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు అరుణ్ రామచంద్రన్ పిళ్ళై ఈ కేసులో అప్రూవర్‌గా మారడం సంచలనం రేపుతోంది. 164 కింద ఈడీ అధికారులకు పిళ్ళై వాంగ్మూలం ఇచ్చారు. దీంతో పిళ్ళై దగ్గర నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టిననట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీగా అరుణ్ రామచంద్రన్‌పై దర్యాప్తు సంస్థల అభియోగాలు ఉన్నాయి. కొంతకాలం నుంచి ఆయన ఈ కేసులో అరెస్టై జైలులో ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు సౌత్ గ్రూపులోని సభ్యులు అప్రూవర్‌గా మారారు. అప్రూవర్‌లుగా మారిన మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా లిక్కర్ కేసులో కొత్త అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

రాబిన్ డిస్టిలరీస్ పేరుతో వ్యాపారం చేసిన పిళ్లై ఢిల్లీ పెద్దలకు భారీ మొత్తంలో ముడుపులు చెల్లించినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. ఇండో స్పిరిట్‌తో పాటు కొందరి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. హైదరాబాద్ కేంద్రంగా సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థలు రామచంద్ర పిళ్లైకి చెందిన సంస్థలు, ఇళ్లు, కార్యాలయాల్లో కీలక సమాచారం రాబట్టాయి. తాజాగా ఆయన అప్రూవర్‌గా మారడంతో రానున్న కొద్ది రోజుల్లో లిక్కర్ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకే ఇండియా కూటమి ఏర్పడింది..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు