AP New Sand Policy : ఏపీలో రేపటి నుంచి ఇసుక ఫ్రీ.. రూల్స్ ఇవే!

ఏపీలో సోమవారం నుంచి ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. నిర్వహణ ఖర్చులు, సీనరేజ్‌ వసూలుచేసి ప్రజలకు ఇసుకను అందజేయనున్నారు. ఏడాదికి 3.20 కోట్ల టన్నుల ఇసుక వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

New Update
AP New Sand Policy : ఏపీలో రేపటి నుంచి ఇసుక ఫ్రీ.. రూల్స్ ఇవే!

AP Sand Policy : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రేపటినుంచి ఉచిత ఇసుక పాలసీ (Sand Policy) అమల్లోకి రానుంది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశాలతో అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే మొదట నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్‌ల నుంచి ఇసుకను అందించనున్నారు. నిర్వహణ ఖర్చులు, సీనరేజ్‌ మాత్రమే వసూలుచేసి ప్రజలకు ఇసుకను అందజేయనున్నారు. అయితే ఉచిత ఇసుక విధానం అమలుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

వైదొలగనున్న జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా..
ఈ మేరకు నీరబ్ కుమార్ (Neerabh Kumar) మాట్లాడుతూ.. గుత్తేదారులు జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా వైదొలగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇసుక నిల్వలను కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు గనులశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే మూడు నెలలకు 88 లక్షల టన్నులు, ఏడాదికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్‌ ఉంటుందని అధికారులు తెలిపారు.

ఆన్‌లైన్‌ వేబిల్లులు జారీ..
అయితే ఇసుక వినియోగదారులకు తొలుత వారం, పది రోజులు చేతిరాతతో వేబిల్లులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌ వేబిల్లులు జారీచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎడ్లబండ్లలో నేరుగా తెచ్చుకునేలా.. వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఎడ్ల బండ్ల ద్వారా నేరుగా ఇసుక తవ్వి తీసుకెళ్లేలా వీలు కల్పించారు. సమీప గ్రామాల ప్రజలు తమ నిర్మాణ అవసరాలు, అక్కడి ప్రభుత్వ నిర్మాణాలకు ఎడ్ల బండ్ల ద్వారా మాన్యువల్‌గా తవ్వి ఇసుకను తరలించుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక నిల్వకేంద్రాల్లో ఇసుక ధర తెలిపేందుకు బ్యానర్లు ఏర్పాటు చేస్తారు. కలెక్టర్, జిల్లా గనులశాఖ అధికారి పేరిట సంయుక్తంగా బ్యాంక్‌ ఖాతా తెరిచి, ఇసుకకు ప్రజలు చెల్లించిన సొమ్మును ఆ ఖాతాలో వేయనున్నారు. ఇందులో జేసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రాలు ఇసుక తవ్వితీసిన ఖర్చు, నిల్వ కేంద్రానికి రవాణాచేసిన ఖర్చుని ప్రభుత్వం వద్ద ఉంటుంది. త్వరలో ఆ రెండు సంస్థలకు తొలగింపు నోటీసులు ఇచ్చాక, వాళ్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిల లెక్కలు తేల్చి ఈ సొమ్మును బాకీ కింద జమచేసుకోనున్నారు

అక్రమ తవ్వకాలకు పాల్పడకుండా..
ఇక నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడకుండా నిల్వ కేంద్రాల నుంచి తీసుకున్నది అక్రమంగా విక్రయాలు జరపకుండా ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. నిల్వ కేంద్రం నుంచి తరలించే ఇసుకకు వేబిల్లులు జారీచేస్తారు. సెక్యూరిటీ స్టేషనరీ పత్రాలతో కూడిన వేబిల్లులను గనులశాఖ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాలకు పంపిస్తున్నారు. సీనరేజ్‌ కింద టన్నుకు రూ.88 తీసుకుంటారు. గుత్తేదారులుగా ఉన్న జీసీకేసీ, ప్రతిమ సంస్థలు ఇసుక తవ్వినందుకు టన్నుకు రూ.30 చొప్పున వసూలుచేస్తారు. బోట్స్‌మెన్‌ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుక అయితే టన్నుకు రూ.225 చొప్పున తీసుకుంటారు. రీచ్‌ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలించి ఉంటే.. రవాణాఖర్చు కింద టన్నుకు, కి.మీ.కు రూ.4.90 చొప్పున లెక్కిస్తారు. నిర్వహణ ఖర్చుకింద టన్నుకు రూ.20 తీసుకోనున్నారు. వీటన్నింటికీ కలిపి 18% జీఎస్టీ వేస్తారు. ఆయా స్టాక్‌ పాయింట్లలో టన్ను ఇసుక ఎంతనేది కలెక్టర్లు నిర్ణయిస్తారు. ఇందులో ప్రభుత్వం రూపాయి కూడా తీసుకోదు. గతంలో ప్రభుత్వం ప్రతి టన్నుకు రూ.375 చొప్పున గుత్తేదారు నుంచి వసూలుచేసేది. సీనరేజ్‌ కింద వసూలు చేసే రూ.88.. జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీల ఖాతాలకు ప్రతినెలా జమచేయనున్నారు.

Also Read : జగన్ సంచలన నిర్ణయం.. ఆ నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పు!

Advertisment
Advertisment
తాజా కథనాలు