జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి మనం దేశం మీద జరిగిన దాడి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. దేశంలో శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయని ప్రధాని మోడీ ఒక క్యాంపెయిన్ నడిపారని.. పెద్ద పెద్ద బోర్డులు పెట్టారని అన్నారు. ఇది చూసి ఏటా 2 కోట్ల మంది కశ్మీర్ కి వెళ్తుంటారన్నారు. ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం ఎందుకు? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి భద్రత లోపమేనని ధ్వజమెత్తారు. టూరిస్టులపై కాల్పులు జరుపుతుంటే ఆర్మీ వాళ్లు లేనే లేరన్నారు. ప్రొటెక్షన్ కోసం ఉండే సెక్యూరిటీ కూడా లేదన్నారు. ఇంతమంది చనిపోయారు అంటే ప్రభుత్వ లోపమేనన్నారు. ఉగ్రవాదం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని అన్నారు. నేడు దేశ నిఘా వ్యవస్థ దేశం కోసం పనిచేయడం లేదన్నారు. ఇండియా ఇంటలిజెన్స్ అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ల మీద పనిచేస్తోందని ఆరోపించారు.
మోదీకి అధికారంలో ఉండే హక్కు లేదు..
ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లకు అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. వీళ్ళు దేశానికి చౌకిదార్ కాదు..బీజేపీకి చౌకిదార్లని అన్నారు. ఈ దేశ దర్యాప్తు వ్యవస్థలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్నారు. నిఘా వ్యవస్థ బలం అంతా ప్రధాని మోదీ కోసం పని చేస్తోందన్నారు. దేశ భద్రతను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికి కేంద్రం తప్పిదమేనని ఫైర్ అయ్యారు. ఈ ఘటనలో ఒక ముస్లిం కూడా చనిపోయారని.. దేశంలో ఉన్న ముస్లింలను చెడ్డవాళ్ళు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో మతం పేరుతో యుద్ధం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ దేశంలోనే ఇంటర్నల్గా భద్రత లేదన్నారు. అన్ని మతాలు సమానం అనే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. మోదీ శ్రమ దేశ భద్రత కోసం పెట్టి ఉంటే బయట వాళ్ళు చొరబడే పరిస్థితి లేదన్నారు.