వైఎస్ఆర్ తాత వెంకటరెడ్డి వేంకటేశ్వరుడికి వీర భక్తుడు.. మరి మతం ఎందుకు మారాడో తెలుసా?

జగన్ ది ఏ మతం? గత కొన్ని రోజులుగా ఏపీ పాలిటిక్స్ అంతా ఈ ప్రశ్న చుట్టే తిరుగుతున్నాయి. జగన్ ది క్రిస్టియన్ ఫ్యామిలీ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే.. జగన్ పూర్వికులది మొదట హిందూ మతమే.. వారు ఎందుకు మతం మారాల్సి వచ్చిందో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.

New Update

'మా కుటుంబంలో మతాంతర, కులాంతర వివాహాలు ఉన్నాయి.. మా కుటుంబాన్ని కేవలం ఓ మతానికి ఓ కులానికి పరిమితం చేయడం అన్యాయం..' నాడు సీఎంగా ఉన్న సమయంలో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి చెప్పిన మాటలివి..! తిరుమల సెంట్రిక్‌గా వైఎస్‌ కుటుంబం చుట్టూ రాజకీయాలు జరగడం ఇదేం కొత్త విషయం కాదు. సీఎంగా జగన్‌ ఉన్న సమయంలోనూ ఆయన అనేకసార్లు తిరుమల కొండకు వెళ్లారు. దేవుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే ఏనాడు కూడా అన్యమతస్తులు చేయాల్సిన టీటీడీ డిక్లరేషన్‌పై సంతకం చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం అనూహ్యంగా జగన్‌ సంతకంపై రచ్చ జరిగింది. స్వామివారి లడ్డూ ఎపిసోడ్‌ వివాదం ముదురుతున్న సమయంలో ఆయన తిరుమల దేవుడిని దర్శించుకోవాలని నిర్ణయించుకోవడం.. అయితే జగన్‌ను డిక్లరేషన్‌పై సంతకం చేయాలని అధికార కూటమీ నేతలు పట్టుపట్టడం.. జగన్‌ ఇంతలోనే తన పర్యటనను రద్దు చేసుకోవడం చకాచకా జరిగిపోయాయి.

జగన్‌ తల్లి వైఎస్‌ విజయమ్మ చేతిలో ఎప్పుడూ బైబిల్‌ ఉంటుంది. 2019లో జగన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలోనూ విజయమ్మ బైబిల్‌తోనే కనిపించారు. అయితే జగన్‌ కుటుంబం అసలు క్రైస్తవంలోకి ఎందుకు కన్వర్ట్ అయ్యారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో కనిపిస్తుంది. 

రాజశేఖర్ రెడ్డి తాత వేంకటేశ్వరుడికి వీర భక్తుడు..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్వీకుల స్వస్థలం కడప జిల్లా పులివెందుల తాలూకాలోని బలపనుర. వైఎస్ రాజశేఖరరెడ్డి ముత్తాత పేరు యెదుగూరి పుల్లారెడ్డి, ఆయన భార్య పేరు అచ్చమ్మ. పుల్లారెడ్డి-అచ్చమ్మల కుమారుడు వెంకటరెడ్డికి మొత్తం 10 మంది సంతానం. వారిలో ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఆరో సంతానంగా రాజారెడ్డి జన్మించాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి తాత వెంకటరెడ్డి వెంకటేశ్వర స్వామికి వీర భక్తుడు. ఆయన ఓం నమః శివాయ అంటూ పంచాక్షరీ మంత్రాన్ని నిరంతరం జపించేవారు . అయితే ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో చదువును మధ్యలోనే ఆపేశారు. తండ్రి పుల్లారెడ్డితో కలిసి వ్యవసాయం చేశాడు.

వెంకటరెడ్డికి మొదటి భార్య పిల్లలు లేకపోవడంతో మంగమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ రాజా రెడ్డితో సహా మొత్తం 10 మంది పిల్లలు. వెంకటరెడ్డి 1933 లో బలపనూరు నుంచి పులివెందులకు పిల్లలతో పాటు వలస వచ్చారు. ఆ సమయంలోనే ఆయన క్రైస్తవ మిషనరీలకు దగ్గరయ్యారు.. అలా వెంకట్‌రెడ్డి క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. వెంటక్‌రెడ్డి కుమారుడు రాజారెడ్డి కూడా క్రైస్తవ మతాన్ని పాటించారు. ఆయన తన స్వగ్రామమైన పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో పూజలు చేసేవారు. ఇక రాజారెడ్డి కుమారుడు వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి సైతం క్రైస్తవ మతాన్ని పాటించారు. వైఎస్ఆర్  ప్రతిరోజూ జీసస్‌కు ప్రార్థనలు చేసేవారట. తన విజయం కోసం తన తల్లి ప్రార్థనలను అనేకసార్లు గుర్తుచేసుకునేవారు వైఎస్ఆర్.

ఇక వైఎస్‌ పిల్లలు జగన్‌, షర్మిల కూడా అదే మతాన్ని పాటించారు. అయితే 2019 ఎన్నికలకు ముందు జగన్‌ హిందూ మత గుళ్లను సందర్శించారు. 2019లో సీఎంగా ప్రమాణస్వీకార సమయంలోనూ అన్ని మతాల అర్చకులను పిలిచి కార్యక్రమం చేశారు. అయితే జగన్‌ సీఎంగా పాలన కొనసాగిస్తున్న సమయంలో ఆయనపై క్రిస్టియన్‌ ముద్ర ఎక్కువగా పడింది. ఎందుకంటే ఆ సమయంలో హిందూ దేవాలయాలపై గతంలో లేని విధంగా దాడులు జరిగాయని నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అనేకసార్లు ఆరోపించింది. అటు తిరుమల కొండపైనా అన్యమత ప్రచారం జరిగినట్టుగా చెబుతూ వచ్చింది. 

నువ్వు క్రిస్టియన్ సీఎంవి, బైబిల్ పట్టుకో అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ సందర్భంలో చెప్పారంటే జగన్‌పై క్రిస్టియన్‌ ముద్ర ఎలా పడిందో అర్థం చేసుకోవచ్చు. "నాకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి, మీకు ఇష్టమైన దేవుడు ఏసుక్రీస్తు. సీఎం, హోంమంత్రి, డీజీపీ అందరూ క్రైస్తవులే.." ఈ మాటలు కూడా నాడు ప్రతిపక్షలో ఉన్న చంద్రబాబే అన్నారు. ఇక జగన్ తిరుమల ఆలయానికి వెళ్లిన ప్రతిసారీ, క్రైస్తవ మతాన్ని అనుసరించే ముఖ్యమంత్రిని హిందూ మందిరంలో ప్రార్థించడానికి అనుమతించాలా అని టీడీపీ-జనసేన-బీజేపీ నేతలు ప్రశ్నిస్తూ ఉండేవారు. అయితే జగన్‌ టీటీడీ డిక్లరేషన్ ఫారమ్‌పై ఎప్పుడూ సంతకం చేయలేదు. ఇక అధికారాన్ని కోల్పోయిన తర్వాత లడ్డూ కల్తీ ఎపిసోడ్‌లో ఆయన తిరుమల వెళ్లాలని నిర్ణయించుకోవడం.. ఆ తర్వాత డిక్లరేషన్‌పై సంతకం డిమాండ్‌ పెరగడం తెలుగురాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు