/rtv/media/media_files/2026/04/18/pawan-kalyan-2026-04-18-21-09-57.jpg)
Pawan Kalyan
Pawan Kalyan : జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించే దిశగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో “జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను” నియమిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడంతో పాటు, పార్టీ కోసం రాత్రింబగళ్లు కష్టపడుతున్న జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
ఈ ప్రత్యేక కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్కడ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నాయకుల సేవలు, వారి నాయకత్వ లక్షణాలు, పార్టీ పట్ల వారికి ఉన్న అంకితభావం వంటి కీలక అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించనున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 28 మంది సభ్యులతో ఈ కమిటీలను అత్యంత పారదర్శకంగా రూపుదిద్దారు. ఇందులో ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, ప్రతి ఏటా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న ముగ్గురు సాధకులతో కలిపి 7 మంది ప్రధాన సభ్యులు ఉంటారు. వీరికి అదనంగా క్షేత్రస్థాయిలో సమన్వయం చేస్తూ పనిచేసేందుకు మరో 21 మంది సాధకులను ఈ కమిటీలలో భాగస్వాములను చేశారు.
ఈ కమిటీల నియామకంలో జనసేన పార్టీ మహిళా విభాగానికి కూడా పెద్దపీట వేసింది. కమిటీల కూర్పులో వీరమహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ కమిటీల ఎంపికను స్వయంగా సమీక్షించి ఆమోదముద్ర వేశారు. క్షేత్రస్థాయి నుంచి ఈ కమిటీలు సేకరించి అందించే నివేదికలను, సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత.. పార్టీలోని ముఖ్య నాయకుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని, పార్టీ పదవులు , బాధ్యతల కేటాయింపుపై అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.
క్షేత్రస్థాయిలో కష్టపడిన ఏ ఒక్క జనసైనికుడి శ్రమ వృథా పోకూడదని, ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభించాలనేది పవన్ కళ్యాణ్ యొక్క దశాబ్దన్నర క్రితం నాటి ఆలోచన. ఆ సుదీర్ఘ ఆలోచనకు కార్యరూపం ఇస్తూ, పార్టీని గ్రామీణ స్థాయి నుంచి పటిష్ఠం చేసేందుకు ఈ వినూత్న కమిటీల కసరత్తును ప్రారంభించారు. ఈ ప్రక్రియ ద్వారా అటు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం బలపడటంతో పాటు, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాడే సమర్థవంతమైన నాయకత్వం క్షేత్రస్థాయి నుండి వెలుగులోకి వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Follow Us