/rtv/media/media_files/2026/05/29/tirumala-2026-05-29-17-37-26.jpg)
తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపులో కొన్ని కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం టీటీడీ ప్రతిరోజూ మొత్తం 1500 శ్రీవాణి టికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచుతోంది.
ఇందులో 500 టికెట్లను మూడు నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేలా, మరో 200 టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్ ద్వారా విమాన ప్రయాణికులకు జారీ చేస్తోంది. అయితే, మిగిలిన 800 రోజువారీ కరెంట్ బుకింగ్ టికెట్ల కోటాలోనే టీటీడీ ఇప్పుడు సరికొత్త మార్పును తీసుకొచ్చింది.
ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు
ఈ కొత్త నిర్ణయం ప్రకారం.. రోజువారీ కరెంట్ బుకింగ్ కోటాలో ఉన్న 800 టికెట్ల నుంచి, ఇప్పటికే రూ.10 వేల చొప్పున విరాళం చెల్లించి దర్శనం కోసం ఎదురుచూస్తున్న దాతల కోసం ప్రతిరోజూ 300 టికెట్లను ప్రత్యేకంగా కేటాయిస్తారు. 2025 మే 1వ తేదీ నుండి విరాళం అందించి, అర్హులైన దాతలకు మాత్రమే ఈ సరికొత్త సదుపాయం వర్తించనుంది. ఈ ప్రత్యేక కోటా టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ సిస్టమ్లో విడుదల చేస్తారు. మధ్యాహ్నం 1 గంటలోపు ఈ టికెట్లను విజయవంతంగా బుక్ చేసుకున్న భక్తులకు, అదే రోజు సాయంత్రం 4 గంటలకే శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు.
ఈ సరికొత్త కేటాయింపుల విధానం జూన్ 10వ తేదీ నుండి అధికారికంగా అమల్లోకి రానుంది. ఒకవేళ ఉదయం విడుదల చేసిన ఈ 300 ప్రత్యేక టికెట్లలో ఏవైనా మిగిలిపోతే, వాటిని వృథా చేయకుండా తిరిగి సాధారణ భక్తుల కోసం కేటాయించిన కరెంట్ బుకింగ్ కోటాలోనే కలిపేస్తారు. ఈ సరికొత్త పద్ధతి వచ్చే ఏడాది 2027 మార్చి 31 వరకు నిరంతరాయంగా అమల్లో ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. అందువల్ల శ్రీవాణి విరాళాలు ఇచ్చిన దాతలు ఈ సరికొత్త సమయాలను, నిబంధనలను గమనించి తమ తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Follow Us